ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టు తో టీ 20,వన్డే ,టెస్టు సిరీస్ లలో తలపడనుంది. టీ20 సిరీస్ లో భాగంగా రేపు ఆక్లాండ్ వేదికగా ఇరుజట్ల మధ్య మొదటి టీ 20మ్యాచ్ జరగనుంది. భారత కాలమాన ప్రకారం రేపు మధ్యాహ్నం 12:20గంటలకు ఈమ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక మ్యాచ్ కు ముందు మీడియా తో మాట్లాడిన కోహ్లీ కీపర్ గా రాహుల్ నే కొనసాగించనున్నామని చెప్పకనే చెప్పాడు. రాహుల్ బ్యాట్స్ మెన్ గానే కాదు కీపర్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు అతన్ని కీపర్ గా కొనసాగిస్తే జట్టుకు అదనపు బ్యాట్స్ మెన్ గా మరొకరిని తీసుకోవచ్చు అని కోహ్లీ పేర్కొన్నాడు.
అయితే స్పెషలిస్ట్ కీపర్ రిషబ్ పంత్ వున్నా కూడా రాహుల్ వైపే మొగ్గు చూపడంతో పంత్ భవిష్యత్ ప్రశ్నార్ధకం లో పడింది. ఒకేవేళ బ్యాట్స్ మెన్ గా కూడా పంత్ రాణించకుంటే అతను ఇక టీం లో ఉండడం దాదాపు అసాధ్యమే. ఇదిలావుంటే మరోవైపు రాహుల్ అటు బ్యాట్స్ మెన్ గా అలాగే కీపర్ రాణిస్తూ జట్టులో పర్మినెంట్ గా సెటిల్ అయ్యేందుకు తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు.
ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా మొదటి వన్డే లో పంత్ గాయపడడం తో ఆ వన్డే లో రాహుల్ కీపింగ్ చేసే ఛాన్స్ కొట్టేయగా ఆతరువాత జరిగిన రెండుమ్యాచ్ ల్లో కూడా రాహుల్ తన కీపింగ్ తో ఆకట్టుకున్నాడు. అప్పటినుండి రాహుల్ నే రెగ్యులర్ కీపర్ గా కొనసాగించాలని టీమిండియా అభిమానులు కోరుతున్నారు.