అయ్యప్ప దర్శనం కోసం ప్రత్యేక అనుమతి

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు ఓ తొమ్మిదేళ్ల బాలికకు కేరళ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. శబరిగిరి వాసిని తన తండ్రితో కలిసి దర్శనం చేసుకునేందుకు ఓ తొమ్మిదేళ్ల బాలిక కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం... బాలికను ఆలయంలోకి అనుమతించాలని ఆదేశించింది. ప్రస్తుతం కరోనా కారణంగా... ఆలయంలోకి భక్తుల ప్రవేశంపై ట్రావెన్ కోర్ దేవస్థానం ఆంక్షలు విధించింది. కేవలం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే సన్నిధానంలోకి అనుమతిస్తోంది. అది కూడా 48 గంటల ముందు కొవిడ్ పరీక్ష ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ ఉన్న వారికి మాత్రమే పర్మిషన్ ఇస్తోంది.
అటు ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కూడా ఆంక్షలున్నాయి. పదేళ్లు దాటిన బాలికకు, 50 ఏళ్లలోపు మహిళలకు ఆలయంలోనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతిలేదు. ఈ నేపథ్యంతో తాను పదేళ్లు నిండేలోపు అయ్యప్పను దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది కుదరకపోతే... మళ్లీ 40 ఏళ్ల వరకు కూడా తనకు అవకాశం  దక్కదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాకిన్ వేస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం బాలికకు వ్యాక్సిన్ వేయడం కుదరదని వైద్యులు వెల్లడించారు. బాలిక వాదనలు విన్న హైకోర్టు... తండ్రితో పాటు ఆలయంలోకి అనుమతించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా కోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. వ్యాక్సిన్ వేయంచుకోకున్నా కూడా... తండ్రితో కలిసి స్వామిని దర్శించుకునేందుకు బాలికకు అనుమతి ఇచ్చింది కోర్టు. అయితే కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ప్రతి ఏటా నిర్వహించే నిరపుతారి వేడుక కోసం అయ్యప్ప ఆలయ తలుపులు ఆగస్టు 15న తెరుచుకున్నాయి. కరోనా కారణంగా రోజుకు కేవలం 15 వేల మందిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఆగస్టు 23వ తేదీ సోమవారం సాయంత్రం ఈ పూజలు పూర్తవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: