కొన్ని రోజుల క్రితం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం విరుద్ద విమర్శలు చేసుకున్నాయి. బోగ్గు కొరత ఉందని రాష్ట్రాలు అంటుంటే అదేం లేదు కావాల్సినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పింది. కేవలం మూడు రోజులకు సరిపడ బొగ్గు మాత్రమే విద్యుత్ ఉత్పత్తికి ఉందని వార్తలు వచ్చాయి. కానీ, అవేం నిజం కాదని కేంద్రం ఖండించింది. అది నిజమో కాదో ఎవరూ చెప్పలేదు. ఏదేమైనా అప్పుడే కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. దీంతో బొగ్గు విషయం నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే బొగ్గు కొరతకు విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అందుకు ఊతమిస్తోంది.
భవిష్యత్తులో సోలార్ పవర్ వినియోగించుకోవడం గురించి చేసిన ప్రకటన అనుమానాలకు తావిచ్చింది. బొగ్గు కొరతతో కొన్ని రాష్ట్రాలు విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో సౌరశక్తి ని వినియోగించుకునే విషయంలో భారత్ దృష్టి సారించింది. పారిస్ ఒప్పందం ప్రకారం ప్రత్యామ్నాయ శక్తిని వినియోగించుకోవడంపై దృష్టి పెట్టింది. సౌర విద్యుత్తో నడిచే 20 లక్షల వ్యవసాయ పంపు సెట్లను ఏర్పాటు చేయడం, అలాగే విద్యుత్ గ్రిడ్లకు అనుసంధానంగా ఉన్న 15 లక్షల పంపు సెట్లను సౌర విద్యుత్కు అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఎకరానికి 25000 రూపాయలు ఆర్జించవచ్చు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ప్లాంట్లను నెలకొల్పితే ఏటా 65వేల వరకు ఆదాయం లభిస్తుంది. సౌర ప్లాంట్ల ఏర్పాటు ద్వారా కొండంత విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. వచ్చే ఏడాది నాటికి 25.75 గిగా వాట్ల సౌర విద్యుత్ను సాధించడమే లక్ష్యంగా పీఎం కుసుమ్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఇందుకోసం కేంద్రం దాదాపు 34 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
2020-21 బడ్జెట్లో ఈ పథకం విస్తరణను ప్రకటించారు. రాష్ట్రాల డిమాండ్ మేరకు 9 మెగా వాట్ల సౌరవిద్యుత్ సామర్థ్యం ఉన్న ప్లాంట్లకు కేంద్రం ఇప్పటికే నిధులు విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లో సోలార్ పవర్ జనరేషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. భవిష్యత్తులో బొగ్గు ఆదారిత విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొనే పరిస్థితి ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.