తిట్లూ.. బూతులూ..: తెలంగాణ పరువు తీయకుండ్రి సార్లూ..!

Chakravarthi Kalyan
తెలంగాణలో ఇటీవల రాజకీయ కాలుష్యం పెరిగిపోయింది. నేతలు వాడే భాష మరీ దారుణంగా ఉంటోంది. లైవ్‌ ప్రెస్ మీట్లలోనూ కూడా బండ బూతులు తిట్టుకుంటున్నారు.. అలగా జనం కూడా తిట్టుకోలేని స్థాయికి దిగజారి మరీ తిట్టుకుంటున్నారు. ఈ నేతల తిట్లు, సవాళ్లు, బూతులూ చూస్తుంటే.. తెలంగాణ నేతలు అంటే ఇంతేనా అని ఇరుగూ పొరుగు నవ్వుకునే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేతల బూతుల అరాచకం ఎన్నాళ్లు సాగుతుందో..?

రాజకీయ నేతల వెంట పరుష పదాలు రావడం కరెక్టు కాదనుకునే రోజుల్లో ఈ బూతుల భాషకు ఇప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు.. ఉద్యమ సమయంలో ఆయన ప్రత్యర్థులను సన్నాసులు, దద్దమ్మలు, జోకుడుగాళ్లు, పీకుడుగాళ్లు, లంగలు, లఫంగులు.. అంటూ బాగా తిట్టేవారు.. ఉద్యమ సమయంలో జనం ఆవేశానికి ఆ తిట్లు కూడా పెద్దగా అభ్యంతరంగా అనిపించేవి కావు.. కడుపు మండిన ఆవేశం కోటాలో ఆ తిట్లు కొట్టుకుపోయాయి.

సీఎం అయ్యా కూడా సీఎం కేసీఆర్ కొన్నిసార్లు తన పాత భాషను ప్రత్యర్థులకు రుచి చూపించారు. ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న రేవంతుడు తన ప్రతాపం చూపేందుకు తిట్ల భాష ఎంచుకున్నారు. వాడు.. వీడు.. గాడు.. అరే.. ఒరే.. అంటూ ఎంత పెద్ద నాయకుడినైనా తిట్టడం మొదలు పెట్టారు. మరి రేవంత్ రెడ్డి తిడితే టీఆర్ఎస్‌ వాళ్లు ఊరుకుంటారా.. వాళ్లేమైనా తక్కువ తిన్నారా.. వాళ్లు కూడా పాత తిట్లకు తోడు కొన్ని కొత్త తిట్లు నేర్చుకుని మరీ తిట్టడం ప్రారంభించారు.

ఇక ఇప్పుడు ఈ తిట్ల ట్రెండ్‌కు మంత్రి మల్లారెడ్డి మరింత ఊపు తెచ్చారు. గాండు గాడు.. బేకార్ గాడు.. బ్రోకర్ గాడు.. లపంగి గాడు.. పిచ్చకుంట్లోడు..(ఈమాట వాడినందుకు తర్వాత సారీ కూడా చెప్పారనుకోండి) ఇలా.. సాగిపోతున్నాయి తిట్లు.. ఈ తిట్లన్నీ విన్న జనం.. ఈ నేతలను అసహ్యించుకుంటున్నారు. మొత్తానికి మన తెలంగాణ రాష్ట్రం పరువు తీయకండ్రా నాయనా అని తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: