హుజూరాబాద్‌లో బాహుబలి ఎవరు.. కట్టప్ప ఎవరు..?

Chakravarthi Kalyan
హూ కిల్డ్ బాహుబలి.. బాహుబలి 1 సినిమా విడుదల తర్వాత బాగా పాపులర్ అయిన ప్రశ్న ఇది. బాహుబలిని చంపిందెవరు.. అని.. ఆ తరవాత బాహుబలిని కట్టప్ప చంపాడని తేలిపోయింది. సస్పెన్స్ వీడిపోయింది... ఈ ప్రచారంతో సినిమా బంపర్ హిట్ అయ్యింది. సినీ ప్రచార చరిత్రలో ఈ హూ కిల్డ్ బాహుబలి అనేది ఓ రోల్ మోడల్ స్థాయి ప్రచారంగా నిలిచిపోయింది. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా కొందరు ఇదే తరహా ప్రచారాన్ని నమ్ముకుంటున్నారు.

మన దేశంలో ఎన్నికలు అంటే ఎన్నో అంశాలు పని చేస్తాయి.. కులం, బలం, స్థానిక రాజకీయాలు.. ఇలా ఎన్నో అంశాలు కలసిరావాలి. అయితే వీటికితోడు సానుభూతి కూడా ఓ బలమైన ఫ్యాక్టర్‌ అన్నది కాదనలేని వాస్తవం. గతంలో ఎన్నోసార్లు ఇది నిరూపితం అయ్యింది కూడా. ఇప్పుడు హూజూరాబాద్‌లోనూ ఇదే తరహా సానుభూతి రాజకీయం నడుస్తోందా అనిపిస్తోంది. ఎందుకంటే.. తనను చంపించేందుకు ఓ జిల్లా మంత్రి ప్లాన్ చేస్తున్నాడని ఈటల రాజేందర్ సంచలన ఆరోపణ చేశారు.

తనను ఓ జిల్లా మంత్రి చంపించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఓ మాజీ నక్సల్ నాకు సమాచారం ఇచ్చారు. నన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారని ఈటల చెప్పారు.. ఇక జిల్లా మంత్రి అంటే ముందు అందరి దృష్టి వెళ్లేది గంగుల కమాలాకరే మీదకే  కదా. అందుకే ఆయన కూడా వెంటనే స్పందించాడు.. రాజేందర్ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి కాపాడతా.. ఆయన ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదు.. ఇదంతా ఎన్నికల్లో సానుభూతి కోసం ఆడుతున్న డ్రామా అంటూ కౌంటర్ ఇచ్చేశాడు. అంతే కాదు.. ఓ జిల్లా మంత్రి అంటూ డొంక తిరుగుడు ఎందుకు డైరెక్టు పేరు చెప్పొచ్చు కదా అంటూ సవాల్ విసిరాడు గంగుల కమలాకర్.

ఎలాంటి విచారణకైనా సిద్ధం అని.. విచారణలో అది తానే అని తేలితే మంత్రి పదవి వదిలేందుకు సిద్ధం అని సవాల్ విసిరాడు గంగుల.. ఇక వీరిద్దరి వ్యవహారం ఇలా ఉంటే.. కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డి మరో బాంబు పేల్చాడు.. ఈటల గతంలో నన్ను చంపించేందుకు ప్రయత్నం చేశాడని ఆరోపించారు. ఇలా మొత్తానికి హుజూరాబాద్‌ సానుభూతి కోసం నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి చివరకు గెలిచేదెవరో..?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: