హెరాల్డ్ సెటైర్ : అసెంబ్లీకి రాడు కానీ అఖిలపక్షం కావాలట

Vijaya
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. అధికారంలో ఉన్నంతకాలం తనిష్టారాజ్యంగా చెలాయించుకున్నారు. అధికారంలో ఉన్నపుడు ఎవరైనా ఇలాగే ఉంటారని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి విషయంలోను తనమాటే చెల్లుబాటు కావాలని పదే పదే యాగీ చేస్తుండటమే విచిత్రంగా ఉంది. ఎవరు అధికారంలో ఉన్నా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కావచ్చు లేదా ఇంకే విషయంలో అయినా కానీండి అధికారపార్టీ నిర్ణయం ప్రకారమే జరుగుతుందనటంతో సందేహంలేదు. ఐదేళ్ళ చంద్రబాబు పాలన ఎలా జరిగిందనే విషయాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతుంది.



తాజాగా ప్రభుత్వం ఒక్కరోజు అసెంబ్లీ సమావేశం పెట్టడాన్ని చంద్రబాబు నుండి తమ్ముళ్ళందరు పెద్దఎత్తున విమర్శిస్తున్నారు. ఈ ఒక్కరోజు కూడా బడ్జెట్ ఆమోదం కోసమే పెడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా చంద్రబాబు అండ్ కో పట్టించుకోవటంలేదు. తమ సూచనలను ప్రభుత్వం  పట్టించుకోలేదు కాబట్టి ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని డిసైడ్ చేశారు. సరే అసెంబ్లీకి రావటమా ? లేకపోతే మానటమా ? అనేది పార్టీల ఇష్టమే. కానీ అసెంబ్లీ బహిష్కరణపై గతంలో జగన్మోహన్ రెడ్డిని ఎగతాళిచేసిన ఇదే చంద్రబాబు అండ్ కో ఇపుడు తాము కూడా అదేదారిలో నడుస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.




ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఒక్కరోజు అసెంబ్లీకి రావటానికి ఇష్టపడని చంద్రబాబుకు అఖిలపక్షం నిర్వహించమని మాత్రం జగన్ను పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీకే హాజరుకానీ చంద్రబాబుకు అఖిలపక్ష సమావేశం మాత్రం ఎందుకంటు వైసీపీ నేతలు వెటాకారాలాడుతున్నారు. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని అఖిలపక్ష సమావేశం పెట్టు, ఒక్కరోజు అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని పదే పదే గోల చేయటం మాత్రం ఎక్కువైపోయింది. అయినా తాను అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు ఏ ఒక్క అంశంలో అయినా అఖిలపక్ష సమావేశం పెట్టారా ? అప్పట్లో ప్రతిపక్షాలు ఎన్నిసార్లు అఖిలపక్ష సమావేశానికి డిమాండ్ చేసినా ఏరోజు పట్టించుకోలేదు. మరలాంటిది తాను ప్రతిపక్షంలోకి రాగానే అఖిలపక్ష సమావేశం పెట్టమని డిమాండ్ చేస్తే అధికారపక్షం ఎందుకు పట్టించుకుంటుంది ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: