హెరాల్డ్ సెటైర్ : కామిడి అయిపోయిన వీర్రాజు ప్రకటనలు..అధికారం బీజేపీదేనట
175 నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి చాలా చోట్ల గట్టి అభ్యర్ధులే దొరకలేదు. కనీసం ఒక్క అభ్యర్ధి కూడా ప్రత్యర్ధులకు గట్టి పోటి ఇవ్వలేకపోయాడు. ఎంపి ఎన్నికల్లో అయితే పోటీ చేసిన వాళ్ళల్లో చాలమందికి అసలు డిపాజిట్లు కూడా దక్కలేదు. హోలు మొత్తం మీద పార్టీకి మొత్తంమీద వచ్చిన ఓట్ల శాతం 0.84. నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా) కు కూడా 3 శాతం ఓట్లొచ్చాయంటే బీజేపీ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. అప్పటికి ఇప్పటికి పార్టీ పరిస్ధితిలో ఎటువంటి మార్పు రాలేదని చెప్పవచ్చు. కేంద్రంలో బలంగా ఉందనో లేకపోతే ఉత్తరాధి రాష్ట్రాల్లో అధికారంలో ఉందనో అనుకుని ఏపిలో కూడా అధికారంలోకి వచ్చేస్తామని వీర్రాజు రెచ్చిపోవటమే విచిత్రంగా ఉంది. ఏదో తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచినంత మాత్రాన ఏపిలో అధికారంలోకి వచ్చేస్తామని చెప్పేయటానికి మించిన క్యామిడి ఏముంటుంది ?
అసలు ప్రస్తుతం బీజేపీలో ఉన్ననేతలు గట్టి నేతలు ఎంతమంది ఉన్నారో వీర్రాజు లెక్కేసి చెబితే చాలు. గట్టి నేతలంటే నామినేషన్ వేయగానే గెలుస్తారని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్ధులకు గట్టిపోటి ఇచ్చి గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకునే స్ధాయి నేతలు ఎంతమంది ఉన్నారన్నదే అసలైన ప్రశ్న. ఇప్పటికైతే అటువంటి నేతలు టార్చిలైట్ వేసినా ఎక్కడా కనబడటం లేదు. అనంతపురం జిల్లాలోని ధర్మవరం మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి టీడీపీకి రాజీనామా చేసి కమలం కండువా కప్పుకున్నారు. కానీ బీజేపీలో చేరిన దగ్గర నుండి మళ్ళీ ఇంతవరకు ఎక్కడా కనబడలేదు. సూరి అసలు బీజేపీలోనే ఉన్నారా ? ఉంటే ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనబడటం లేదనే ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళే కనబడటం లేదు.