హెరాల్డ్ సెటైర్ : ప్రధాని-జగన్ భేటి పై మీడియాలో ఎవరి గోల వాళ్ళదేనా ?
ప్రధాని-జగన్ భేటిపై ఓ టీవీ చానల్ చేసిందిదే. వీళ్ళద్దరి భేటి మొదలుకాకముందు నుండే ఎన్డీఏలో వైసిపి చేరుతోందనే ప్రచారాన్ని మొదలుపెట్టేసింది. ఇదే సమయంలో ఎన్డీఏలో చేరితే ఉపయోగం ఏమిటి ? దూరంగా ఉంటే నష్టం ఏమిటి ? అంటూ చెప్పిన విషయాలనే తిప్పించి మళ్ళించి ఒకే విషయంపై గంటల పాటు సోది వండి వార్చేసింది. భేటి ముగియగానే ఎన్డీఏలో చేరాల్సిందిగా జగన్ కు ప్రధానమంత్రి ఆఫర్ ఇచ్చారనే విషయం విశ్వసనీయంగా తెలిసిందంటూ నానా యాగీ చేసేసింది. మొదటే చెప్పుకున్నట్లుగా ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో చర్చించిన వివరాలు ఇంత తొందరగా బయటపడే అవకాశాలే లేవు. అయినా విశ్వసనీయవర్గాల ముసుగులో తాను చెప్పదలచుకున్న సోదంతా చెప్పేసింది.
ఇక జగన్ మీడియా సాక్షి అయితే భేటి జరిగిందని, సానుకూల వాతావరణంలో జరిగిందంటు చెప్పి ముగించేసింది. వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, నిధుల విడుదల, స్పెషల్ స్టేటస్ లాంటి అంశాలను జగన్ ప్రస్తావించారంటు చెప్పింది. అధికార మీడియా కదా నోటికొచ్చింది చెప్పేసే అవకాశాలు లేవు. ఇక ఎల్లోమీడయా విషయం చూస్తే ప్రధాని-జగన్ భేటి అశంపై దృష్టే పెట్టినట్లు లేదు. ఎందుకంటే అక్కడ భేటి జరుగుతున్నపుడు, భేటి ముగిసిన తర్వాత కూడా ఏదో ఓ అడ్వర్టైజ్మెంట్ తో సరిపెట్టేసుకుంది. ఎందుకంటే ఆమధ్య అమిత్ షా-జగన్ భేటి పై నోటికొచ్చిన పైత్యాన్నంతా గుప్పించేసింది. జగన్ పై అమిత్ షా ఆగ్రహమని, తీవ్ర అసంతృప్తని నోటికొచ్చింది చెప్పేసి ఓ నలుగురితో చెప్పించేసింది. అయితే అదంతా తప్పని కేవలం కల్పితమని తర్వాత తేలిపోవటంతో పరువంతా పోయింది.