మంచిమాట: ఎదుటివారి అవిటితనాన్ని ఎగతాళి చేస్తే..శిక్ష తప్పదు..!!

Divya
అనగనగా ఒక అడవిలో జింక ఉండేది. అది పుట్టుకతోనే అవిటి కాలితో పుట్టింది. దానికి ఒక దుప్పితో మంచి స్నేహం ఉండేది. రెండు మేతకు వెళ్ళినా, ఆడుకోవటానికి వెళ్లినా, రెండూ కలిసి వెళ్ళేవి. ఆ అడవిలో చాలా జంతువులు ఉండేవి. అన్ని ఎంతో సామరస్యంగా ఉండేవి. మిత్రమా..! నాకు ఈ నదిలో ఈత కొట్టాలని ఉంది. నీలా చిందులేస్తూ ఆడుకోవాలని, పరిగెత్తాలని ఉంది. కానీ ఏం చేయను అడవితల్లి నన్ను అవిటి దానిగా పుట్టించింది.. అంటూ బాధపడింది జింక..అప్పుడు దుప్పి .. నువ్వలా బాధపడకు మిత్రమా.. మనలో ఉన్న లోపాలను చూసి బాధపడకూడదని పెద్దలు చెబుతున్నారు కదా .. అని అన్నది..మరి నాకు ఈత నేర్పించవా.. అని అడిగింది జింక..
అప్పుడు దుప్పి నీకు ఒక కాలు లేదు కదా..! నాలుగు కాళ్లు ఉంటేనే ఈత కొట్టగలవు.. లేదంటే మునిగిపోతావు.. అంది దుప్పి..అప్పుడు జింక మొండిగా.. నాకు అవన్నీ తెలియవు.. నువ్వు ఈత నేర్పించు.. అంతే..అని అన్నది.ఇక దుప్పి మాట్లాడుతూ.. నీ మాటే నెగ్గాలనుకుంటావు కానీ ఎదుటివారి మాటలు అస్సలు పట్టించుకోవే అంటూ జింకను నీళ్ళల్లోకి దించి, ఈత కొట్టించడం నేర్పుతోంది. కానీ జింక సరిగ్గా ఈదలేక నీళ్ళల్లో మునిగి పోయింది. అప్పుడే దుప్పి జింకను కాపాడింది.
చూశావా నీ వల్ల కాని పనులు చేస్తాను అంటావ్ ఇప్పుడు ఎలా అయింది చూడు.. నేను కానీ లేకపోయి ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేది తెలుసా..? అని కోప్పడింది దుప్పి.. అవును మిత్రమా నన్ను క్షమించు అంది జింక.ఇక  జింక అవిటితనాన్ని చూసి ఆవు ,తోడేలు , పాము, పులి, గ్రద్ద , అడవి దున్నలు కలిసి  ఓ కుంటి జింక అంటూ ఎగతాళి చేసేవి. వాళ్లందరి అవహేళనలు విని జింకకు ఏడుపు ఆగలేదు. కూలబడింది..అక్కడే వున్న తన తల్లికి చెప్పింది.
వాళ్ళమ్మ ఆలస్యం చేయకుండా అడవి రాజయిన సింహానికి ఫిర్యాదు చేసింది. మరునాడు ఉదయాన్నే సభ ఏర్పాటు చేయడం జరిగింది. సింహరాజు అవిటి జింకను ఎగతాళి చేసిన వారందరికీ రెండు రోజుల దాకా అన్నపానీయాలు అందించక తన కొండగుహలో బంధించి శిక్షించింది. ఎప్పుడైనా ఎవరైనా అవిటి జింకను ఎగతాళి చేసినట్లు వినిపిస్తే శిక్ష ఇంతకన్నా ఘాటుగా ఉంటుంది. సింహం తీర్పు కి జంతువులన్నీ తలూపాయి. కుంటి జింక ఈత కొట్టడం అంటే చాలా ఇష్టమని గ్రహించిన దుప్పి , జింకను తన వీపు మీద కూర్చోబెట్టుకొని నదిలో ఈత కొట్టేది.. జింక కూడా చాలా సంతోషించేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: