జగన్ని ముంచడానికైనా పోలవరంని నిర్మించవచ్చుగా?
తమ రాజకీయ
ప్రత్యర్థి నాశనం అయిపోవాలని కోరుకోవడం కంటె రాజకీయ పార్టీలకు వేరే ఇంపార్టెంట్
సంగతి ఏముంటుంది. జగన్కు భవిష్యత్తులేకుండా పోవాలని.. తెదేపా నిత్యం తపన పడుతూ ఉంటుంది.
అలాగే.. తెలుగుదేశం గద్దె దిగితే తమకు ఖాళీఏర్పడుతుందని వైకాపా ఎదురుచూస్తుంటుంది.
రాష్ట్రంలో ఏం జరిగితే జగన్ మునిగిపోతాడో.. తెదేపాకు తెలుసు. కానీ వారు ఆ పని మాత్రం
చేయడం లేదు. పోలవరం పూర్తయితే.. జగన్ గల్లంతవుతాడని.. డాంబికంగా సెలవిస్తున్న
తెదేపా సచివులు.. కనీసం ఆ లక్ష్యం కోసమైనా.. దానిని సత్వరం పూర్తి చేయచ్చు కదా అని
విమర్శలు వస్తున్నాయి.
ప్రత్యేక హోదాపై వైకాపా అధినేత వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష ఆ పార్టీ మనుగడ కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసమేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వైకాపా గల్లంతవుతుందని, ఈ కారణంగానే ఆ ప్రాజెక్టును అన్ని విధాలుగా అడ్డుకునేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నాడని మంత్రి దుయ్యబట్టారు. పనిలోపనిగా జగన్ది దొంగ దీక్ష అని, కొంగ జపం చేస్తున్నారని కూడా ముక్తాయించారు. పైగా ఆ దీక్షలో ఆయనతో పాటు కూర్చున్నది నేరస్తుల సమూహమని వర్ల రామయ్య ఆరోపించారు.
తెలుగుదేశం మంత్రులకు, నేతలకు ప్రతిపక్షనేతను ప్రతి అంశానికీ ఆడిపోసుకోవడంతోనే సరిపోతుంది కాని జగన్ నోరు మూయించడానికి ఏదైనా ఒక్కటంటే ఒక్క మంచి పనయినా ఈ ఒకటిన్నర సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం ఎందుకు చేసి ఉండలేదన్నది ఇక్కడ ప్రశ్న. ఉనికికోసమే ఆయన పోలవరంను వ్యతిరేకిస్తున్నమాట నిజమే అయితే ఆయన ఉనికిని పోగొట్టే మంచి పని ఏదో చేతల్లో చూపించవచ్చు కదా. జగన్ని ముంచడానికైనా ప్రభుత్వం అగమేఘాల మీద పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతిపరం చేయవచ్చు కదా? అటు పట్టిసీమా పూర్తి కాక, ఇటు పోలవరాన్ని పట్టించుకోక తమాషా చూస్తున్న అధికారపార్టీ జగన్ని జనం దృష్టిలో హీరోనూ చేయడం తప్పితే ఇటీవలికాలంలో సాధించిందేమన్నా ఉందా? పైగా జగన్కి ఇక్కడేం పని ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో కూర్చుని దీక్ష చేస్తే బాగుంటుంది కదా అని వెటకారాలు.
అసలు విషయం ఏమిటంటే ఈ వెటకారాలతోనే ప్రభుత్వం కాలం గడిపేసింది. రాక్షసులు అడ్డుకుంటున్నారని ఆడిపోసుకోవడం ఎందుకు.. ఎలా దీక్ష చేస్తావో చూస్తామంటూ బెదిరించడం ఎందుకు? చేయలేనమ్మకు సోకులెక్కువ అనే సామెత టీడీపీ ప్రభుత్వానికి చక్కగా సరిపోయేటట్లుంది. ఖర్మ.