హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అంటే బలమైన ఎదురుదాడికి, వివిధ కోణాల్లో విశ్లేషణలకు పెట్టింది పేరు. బీజేపీ అంటే భగ్గుమనే ఈ నేత తాజాగా తనలోని కొత్త వేరియేషన్ను ప్రదర్శించారు. డ్యాన్స్ చేసి తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో హాజరైన వారు కేరింతలు వేశారు.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, ఎంఐఎం పార్టీ 44 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ వేదికపై మాట్లాడిన తర్వాత.. అక్కడ నుంచి వెనుదిరుగుతున్న సమయంలో స్టేజ్ మెట్లపై ఓవైసీ కొన్ని స్టెప్పులేశారు. కొన్ని సెకన్ల పాటు తన బాడీని షేక్ చేసి అందర్నీ స్టన్ చేశారు. ఒక్కసారిగా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే సరికి అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ‘మియా భాయ్’ పాటకు డ్యాన్స్ చేయడంతో సభకు హాజరైనవారు కేరింతలు కొట్టారు. ఎంఐఎం పార్టీ సింబల్ అయిన పతంగిని గుర్తు చేసే విధంగా ఎంపీ ఓవైసీ స్టెప్పులేసినట్లు కొందరంటున్నారు. ఓవైసీ డ్యాన్స్ వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ షేర్ చేసింది.
మహారాష్ట్రలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నారు. వీరసావర్కర్కు భారతరత్న కోసం ప్రయత్నిస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందుత్వం కోసం పనిచేసిన వీరసావర్కర్కు భారతరత్న ఇవ్వదల్చుకున్నప్పుడు నాథూరాం గాడ్సేకు కూడా భారతరత్న ఇవ్వొచ్చుగా అని ఎద్దేవా చేశారు. సరైన నిర్ణయం తీసుకొని ఓటు వేయాలని కోరారు. మహా ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ, బీజేపీ-శివసేన కలిసి బరిలో దిగుతుండగా...ఎంఐఎం ఒంటరిగా పోటీ చేస్తోంది.