ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీ.. లోలోన కుమిలిపోతున్న ప్రయాణీకులు..!
ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణం కట్టిన ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. దసరా కోసం సొంతూళ్లకు వెళ్లాలని ఎగబడుతున్న జనం జేబులకు ప్రైవేట్ ట్రావెల్స్ చిల్లులు పెడుతున్నాయి. పండగ రద్దీకారణంగా ఇటు రైళ్లు కిక్కిరిసిపోవడంతో అగచాట్లు అన్నీ ఇన్నీకావు.
అసలే పండగ సీజన్ పైపెచ్చు ఆర్టీసీ కార్మికుల సమ్మె వెరసి తెలంగాణలో నరకప్రాయం తయారైంది ప్రజల దుస్థితి. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కొన్ని బస్సులు నడుతుపున్నా.. ప్రజల అవసరాలకు ఏమూలన సరిపోవడం లేదు. సందట్లో సడేమియా అన్నట్లు ఆర్టీసీ సమ్మెను క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ప్రయాణీకుల నుంచి ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. ఆరంఘర్ నుంచి కర్నూలుకు 400 రూపాయలు, మహబుబ్నగర్కు 250 రూపాయలు, కొత్తకోట, కొల్లాపూర్, వనపర్తి రూట్ లలో పరిమితికి మించి ప్రయాణీకులతో వెళ్తున్నారు.