ఇక మిగిలింది అరెస్టే.. అదీ, ఏ క్షణంలోనైనా..
రాత్రి 1:౩౦లోపు లొంగిపోవాలని వెంటనే నోటీసులు జారీ చేశారు. రెండు గంటల్లోగా విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అంతకుముందు.. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఐఎన్ఎక్స్ కేసును ఓ ప్రత్యేకమైన మనీ లాండరింగ్ కేసుగా అభివర్ణించింది. సమర్థవంతమైన విచారణ జరుగడానికి నిర్బంధ విచారణ అవసరమని జస్టిస్ సునీల్ గౌర్ పేర్కొన్నారు.
మంగళవారమే కేసును సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టే విధంగా చిదంబరం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.ఇకపోతే.. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న ఆయన విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు అనుమతులు ఇచ్చారని.. ఆ కంపెనీ పెట్టుబడులు సేకరించింది చిదంబరం తనయుడు కార్తి కంపెనీల నుంచేనని.. ఈ కంపెనీల మధ్య 305 కోట్లు చేతులు మారాయని కేసు నమోదైంది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు చిదంబరానికి గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్పై స్టే ఇచ్చింది. దానిని తాజాగా రద్దు చేసింది. దాంతో, చిదంబరం అరెస్టు ముంగిట నిలిచారు. ఏ క్షణంలో అయినా ఆయనను అరెస్టు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉంది.