బాలయ్య, రోజా. ఇప్పుడు ఈ రెండు పేర్లు ఏపీ రాజకీయాల్లో భారీ ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఒకరు అధికార టీడీపీలో కీలక పాత్ర పోషించగా మరొకరు వైసీపీలో కీ పొజిషన్లో ఉన్నారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులపై తీవ్రస్థాయిలో ట్రెండింగ్ కొనసాగుతోంది. విషయంలోకి వెళ్తే.. వెండి తెరపై నాయికా నాయకులుగా రక్తికట్టించి మంచి మార్కులు కొట్టేసిన బాలయ్య, రోజా.. తర్వాత కాలంలో రాజకీయ అరంగేట్రం చేశారు. గతంలో టీడీపీతో ప్రారంభమైన రోజా రాజకీయ ప్రస్థానం.. తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లాలని అనుకున్నా.. అనూహ్యంగా వైసీపీ వైపు మళ్లింది. ఇక, బాలయ్య గత ఎన్నికలకు ముందు తన తండ్రిస్థాపించిన టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.
రోజా రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా..మూడోసారి చిత్తూరు జిల్లా నగరి నుంచి విజయం సాధించింది. ఇక, బాలయ్య అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఇక, తాజా ఎన్నికల్లోనూ ఇద్దరూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014లో పోలిస్తే.. ఇద్దరూ కూడా భారీ పోటీ ఎదుర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో నువ్వా-నేనా అని సాగిన పోరులో ఇద్దరూ అలుపెరుగకుండా ప్రచారం చేశారు. బాలయ్య ఏకంగా తన సతీమణిని కూడా రంగంలోకి దింపేశారు. రోజా మాత్రం ఒంటరిగానే ప్రచారం చేశారు. మొత్తానికి మెజారిటీ తగ్గినా ఇద్దరూ కూడా గెలుపు గుర్రం ఎక్కుతారని అంటున్నారు.
ఇక, ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ గెలిచినా.. ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినా.. బాలయ్యకు మంత్రి పదవి దక్కేఛాన్స్ లేదు. ఆయన షూటింగులు, సినిమాలను వదిలి పెట్టకపోవడంతో ఆయనను కేబినెట్కు దూరంగానే ఉంచనున్నారు. ఇక, రోజా విషయానికి వస్తే.. వైసీపీ అధికారంలోకి వస్తే.. రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఎన్నికలు ముగిసిన రెండో రోజు నుంచి కూడా ప్రచారం జరుగుతోంది. ఏకంగా జగన్ ఆమెకు హోంశాఖనే ఇవ్వనున్నారని, 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డికి ఈ శాఖనే అప్పగించి సంచలనం సృష్టించారు. అదే ఆనవాయితీని జగన్ కూడా పాటిస్తారని, రోజాకు హోం శాఖను అప్పగిస్తారని అంటున్నారు . ఇదే జరిగితే.. రాజకీయాల్లో బాలయ్యను మించిన పొజిషన్లో రోజా ఉంటారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.