రాష్ట్రానికి దశ, దిశ నేర్పే ఎన్నికల క్రతువును పరమ యజ్ఞంగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం ఒక పక్క విఫలమైతే.. రాజకీయ పరిణితి ఉన నాయకులు, ముఖ్యంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉందని గొప్పలు పోయే నేతలు ఏంచేయాలి? ఎలా వ్యవహరించాలి? కానీ, కనీస ఔన్నత్యం కూడా మరిచి, కేవలం అధికారమే పరమావధిగా పెట్టుకుని మరోసారి సీఎం అవ్వాలనే దుగ్ధతో ఎంత నికృష్ట రాజకీయాలకైనా తెగబడుతున్న పరిస్థితి ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది. ఉల్టాచోర్.. కొత్వాల్కో డాంటే! అనే సామెతను నిజం చేస్తూ.. తాము చేస్తున్న పనులను కూడా విపక్షంపై నెట్టేసి ఆనందించే నేతలు ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నారు.
రాజధానికి భూములు ఇవ్వలేదనే కారణంగా రాత్రికి రాత్రి పంటలను తగలబెడతారు. అదేవిధంగా దళితులను అవమానిస్తారు. మీకెందుకురా? రాజకీయం అన్న నాయకులకు కూడా ఈపార్టీ పల్లకీ మోసేలా చేస్తుంది. ఇక, మహిళా అధికారుల పరిస్థితి గురించి ప్రస్తుత పాలనలో ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. వనజాక్షిని ఓ ఎమ్మెల్యే కొట్టిస్తే.. దేవాదాయ శాఖలో సీనియర్ ఉద్యోగిని సాక్షాత్తూ.. ఉన్నతాధికారి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారి రమ్మని కోరితే.. కూడా చర్యలు లేని పాలనలో ఏపీ విలసిల్లుతోంది. ఇక, వీటికితోడు మంగళగిరికి, మందలగిరికి తేడా కూడా తెలియని మంత్రివర్యులను గెలిపించుకుని ముఖ్యమంత్రి పీఠానికి సిఫారసు చేయించుకోవాల్సిన బాధ్యత కూడా ఏపీ ప్రజలపైనే ఉంది.
ఆక్వా పరిశ్రమను వద్దన్న ప్రజలను ఇనుప బూట్లతో అణిచేసిన ఘనత ఈ ప్రబుత్వానికే దక్కింది. ఇక, ఫోన్ ట్యాంపింగులు, డేటా చోరీలు, ప్రత్యేక హోదా వద్దన్న నోటితోనే హోదా కోసం ధర్మ పోరాట దీక్షలు చేసిన ఘనత ఇలా చెప్పుకొంటూ పోతే.. అనేకానేకవిషయాల్లో అశుద్ధంలో పొర్లిన నాయకులు.. ఎదుటి పార్టీపై అంతే స్థాయిలో లేనిపోని కేసులు నమోదయ్యేలా చూడడం, వారినిఏపీకి బద్ధ శత్రువులుగా పరిగణించడం వంటివి కూడా కనిపించాయి. ఇక, వీటిని తాన.. అంటే తందాన అన్నట్టుగా భజన చేసే పత్రికా, మీడియా యాజమాన్యాలు ఉండగా.. ఇక, బాబు గారి హయాంలో అన్యాయాలు, అక్రమాలు గజ్జెకట్టి నర్తించక ఏం చేస్తాయి? అయిననూ వారికే ఓటేయాలని, లేకుంటే ప్రజాస్వామ్యం తల రెండు ముక్కలు అయిపోతుందని గీతా సారాన్ని కమ్మగా వండివార్చిన కులజ్యోతిని ఎంత మెచ్చుకున్నా తక్కువే.
ఇక హోదా, ప్యాకేజీ విషయంలో వాళ్లు ఎప్పుడు ఏం చెప్పినా అదే వినాలి. వాళ్లు తప్పు చేసినా కరెక్టే.... ఎదుటి వారు ఎన్ని ఒప్పులు చేసినా అవి వాళ్ల కంటికి మాత్రం ఎప్పుడు తప్పులుగానే కనపడతాయి. ఐదేళ్ల పాటు ఏపీ ప్రజలు ఎన్నో ఆశలతో అధికార అందలం ఎక్కిస్తే ఏం జరిగింది ? ఎన్ని హామీలు ఇచ్చారు ? ఎన్ని నెరవేర్చారు... ఐదేళ్లు ఏం చేయకుండా చివర్లో ఓటర్యను మభ్య పెట్టేందుకు ఎంత రాజకీయం చేశారు ? అన్నది ఏపీ ప్రజలకు తెలియంది కాదు. సో.. ఏదేమైనా.. ఎవరు ఎలాంటి వారో.. ఎవరికి పట్టం కట్టాలో ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఈవీఎంలలో తమ నిర్ణయాన్ని నిక్షిప్తం చేస్తున్నారు.