ఊరకరారు మహానుభావులు! అన్నట్టుగా రాజకీయ దిగ్గజం, టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లో కానీ, ప్రబుత్వ పరంగా కానీ ఆయన ఏ అడుగు వేసినా ఊరికేనే మాత్రం పడదు! తనకు అందివస్తుందని, ప్రత్యేక హోదా ఇస్తుందని భావించి దశాబ్దాల వైరాన్ని కూడా పక్కన పెట్టి కాంగ్రెస్తో జట్టుకట్టారు. అదే క్రమంలో తెలంగాణాలోనూ కలిసి పోటీ చేశారు. అయితే, అక్కడి ప్రయోగం వికటించింది.దీనిని పక్కన పెడితే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సంజీవనా? అని ప్రశ్నించిన నోటితోనే ప్రత్యేక హోదాను సమర్ధించుకున్న నాయకుడు చంద్రబాబు. అదేసమయంలో కేంద్రంలోనూ మోడీని గద్దె దింపి కాంగ్రెస్తో కూడిన మహాకూటమిని అక్కడ కూర్చోబెట్టాలని బాబు ప్రయత్నించారు.
తద్వారా ఏపీకి ఏదో జరుగుతుందని కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చేవారినే ఎంచుకుని ఎన్నుకోవాలని ఆయన పిలుపు ని చ్చారు. అదేసమయంలో ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లోనూ టీడీపీని గెలిపించాలని కూడా ఆయన పిలుపునిచ్చిన విషయం కొత్తకాదు. అయితే, ఇప్పుడు గడిచిన రెండు రోజుల్లో జాతీయస్థాయిలో రాజకీయాలు మారిపోయాయి. చంద్రబాబు ప్రవచి త మహాకూటమి సక్సెస్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. కాంగ్రెస్తో జట్టుకు కొన్ని పార్టీలు ముందుకు రావడం లేదు. దీంతో చంద్రబాబు అనూహ్యంగా తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టిన ఆయన తాజాగా ప్రజల సంక్షేమం అనే నినాదాన్ని భుజాన వేసుకున్నారు.
ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అనే నినాదంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సామాజిక పించన్లు పెంచారు. దాదాపు 55 లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తున్నారు. అయి తే, అదేసమయంలో ఆయా కుటుంబాల్లోని వారిని కూడా తనవైపు తిప్పుకొనేలా ఆయన చేస్తున్నారు. అదేసమయంలో త్వరలోనే మళ్లీ నిరుద్యోగ భృతిని కూడా ర.2000 లకు పెంచనున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని దాదాపు కోటి మంది వరకు చంద్రబాబుకు అనుకూలంగా మారతారని అంటున్నారు. అయితే, నిజంగా ఈ వ్యూహం కనుక పారితే. చంద్రబాబుకు తిరుగులేదు. కానీ, ప్రజలకు ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని జగన్ చెబుతున్నారు.
ఇక, పవన్ ఏకంగా కుటుంబానికి 3500 చొప్పున తెల్లరేషన్ కార్డు దారులకు ఇస్తామని, అదేవిధంగా వంట గ్యాస్ను ఫ్రీగా ఇస్తానని పవన్ హామీ ఇచ్చాడు. జగన్ కూడా విద్య నుంచి వైద్యం వరకు అన్ని వృత్తుల వారి వరకు కూడా అనే వరాలు ప్రకటించి ఉన్నారు. ఈ నేపత్యంలో ఇప్పుడు బాబు వేసిన పాచిక ఏమేరకు పారుతుంది? అనేది అటు జగన్, ఇటు పవన్ విజృంభించి ప్రచారంలోకి దిగనంత వరకు బాబు బెస్ట్ అనే చెప్పాల్సి ఉంటుంది. వారిద్దరూ రంగంలోకి దిగాక పరిస్థితి మారిపోయే ప్రమాదమే కనిపిస్తోంది.