కులం లెక్కలతో టికెట్ ఇచ్చిన పవన్...!
జనసేన పార్టీ పెట్టి ఇప్పటికీ 5 ఏళ్ళు గడిచి పోయింది అయితే ఇంత వరకు ఈ పార్టీ లోకి ఎవరు జాయిన్ అవ్వలేదు. అయితే ఒక పార్టీ టికెట్ ఇవ్వాలంటే కుల ప్రాతిపదికిన ఇస్తారు. జనసేన పార్టీ తరఫున ఏపీలో వచ్చే ఏడాది రాబోయే ఎన్నికల్లో పోటీచేయడానికి తొలి ఎమ్మెల్యే టికెట్ ను తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పితాని బాలకృష్ణకు కేటాయిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ‘ఆయనదీ నాదీ ఒకటే కులం.. అందుకే టికెట్ ఇస్తున్నా’ అని బహిరంగంగా పేర్కొన్నారు. కాకపోతే పవన్ కల్యాణ్ ఇక్కడొక చిన్న ట్విస్టు పెట్టారు.
పవన్ కల్యాణ్ ది కాపు కులం. పితాని బాలకృష్ణ ది శెట్టి బలిజ. మరి ‘ఆయన్దీ నా కులమే’ అని పవన్ ఎందుకన్నారు. అక్కడే ఉంది ట్విస్టు. ‘మా ఇద్దరిదీ ఒకటే కులం.. అదే పోలీసు కులం’ అంటూ పవన్ తన మార్కు చమక్కు వినిపించారు. ‘మా నాన్న కానిస్టేబుల్, పితాని బాలకృష్ణ కూడా కానిస్టేబులే. అందుకే తొలి టికెట్ ఇస్తున్నా’ అని పవన్ పేర్కొన్నారు.
ముమ్మిడివరానికి చెందిన పితాని బాలకృష్ణ కానిస్టేబుల్ గా ఉంటూ రాజీనామా చేసి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గానికి ఇన్చార్జిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఆయన జనసేనకు దగ్గరయ్యారు. చివరికి మంగళవారం నాడు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో తన నియోజకవర్గంలోని కొందరు కార్యకర్తలతో కలిసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.