ఉభయ గోదావరి జిల్లా లలో జగన్ కు రిపోర్ట్ ఏమని వచ్చింది...!
అందరి అంచనాల్నీ పటాపంచలు చేస్తూ, పశ్చిమగోదావరి జిల్లాలోకి వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రవేశించడం, ప్రజాసంకల్ప యాత్రకు ఉభయ గోదావరి జిల్లాల్లో జనం పోటెత్తడం తెల్సిన విషయాలే. తూర్పు గోదావరి జిల్లాలో.. అదీ జగ్గంపేట నియోజకవర్గం చేరుకునేసరికి వైఎస్ జగన్, కాపు రిజర్వేషన్లపై మాట్లాడాల్సి వచ్చింది. జగన్ మాట్లాడిన మాటల్ని తెలుగుదేశం పార్టీ వివాదాస్పదం చేయడం, దాంతో ప్రజాసంకల్ప యాత్రలో కొంత 'యాగీ' చోటు చేసుకోవడం జరిగిపోయాయి. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగిందనుకోండి.. అది వేరే విషయం.
ఆయా నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర చేస్తోంటే, ఇంకోవైపు.. పార్టీ తరఫున అంతర్గత సర్వేలు అక్కడికక్కడ జరిగిపోతున్నాయి. అలా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన 'కంప్లీట్ రిపోర్ట్' వైఎస్ జగన్ వద్దకు నిన్ననే చేరినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఇంపాక్ట్ చాలా బలంగా వుండబోతోందన్నది ఆ రిపోర్ట్ సారాంశమట. మరోపక్క, టీడీపీ శ్రేణుల్లోనూ ఈ విషయమై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సగానికి పైగా సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కన్పించనుందనీ, మిగతా సీట్లలో హోరా హోరీ తప్పదనీ, సాధారణ సర్వేలు సైతం తేల్చి చెబుతున్నాయి.