భారత దేశంలో ఈ మద్య కాలంలో మహిళలపై, చిన్నారు, వృద్దులపై కామాంధులు రెచ్చిపోతున్నారు..అత్యాచారాలు, హత్యలకు తెగబడుతున్నారు. మహిళలు పట్టపగలు బయటకు రావాలన్నా భయంతో వణికిపోతున్నారు. ఇక దేశం నడిబొడ్డున అర్ధరాత్రి పారామెడికల్ విద్యార్థిని అతిక్రూరంగా లైంగిక దాడి చేసి చంపిన దోషుల భవితవ్యం నేడు తేలనుంది. మరణ శిక్ష రద్దు కోరుతూ దోషులు దాఖలు చేసిన పిటిషన్పై నేడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.
ఇప్పటికే కింది కోర్టు దోషులకు ఉరిశిక్షను విధించిన నేపథ్యంలో, వారికి ఉరిశిక్షే ఖరారవుతుందా? లేక జీవితఖైదు శిక్షగా పడుతుందా? అన్న విషయం నేడు తేలనుంది. 2012 డిసెంబర్ 16వ తేదీన వైద్య విద్యార్థినిపై ఓ మైనర్ సహా ఆరుగురు అత్యంత పాశవికంగా అత్యాచారం జరపగా, 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె, డిసెంబర్ 29న మరణించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్పై సోమవారం ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. నిందితులకు ట్రయల్ కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన మరణ శిక్షలను గతేడాది మేలో సుప్రీం కోర్టు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పును సమీక్షించాలని కోరుతూ దోషులు ముఖేష్(29), పవన్ గుప్తా(22), వినయ్ శర్మ(23)ల తరపున పిటిషన్ దాఖలైంది. మరో నిందితుడు అక్షయ్ కుమార్ సింగ్(31) కూడా దాఖలు చేయనున్నట్లు అతని తరపు న్యాయవాది తెలిపాడు.
రామ్ సింగ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా రివ్యూ పిటిషన్పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు భానుమతి, అశోక్ భూషణ్ల ఆధర్వ్యంలో ధర్మాసనం విచారణ చేపట్టి, తీర్పును రిజర్వ్లో ఉంచింది. మరికొద్ది గంటల్లోనే తీర్పు వెలువడనుండటంతో ఉత్కంఠ నెలకొంది. మరణ శిక్షనే అమలు చేయాలని తీర్పిస్తుందా? లేదా? జీవిత ఖైదుగా మారుస్తుందా? అన్న చర్చ మొదలైంది.