ప్రకాశం జిల్లాలో టిడిపి నేత త్వరలో వైసిపిలో చేరనున్నారు. గిద్దలూరు మాజీ ఎంఎల్ఏ అన్నా రాంబాబు త్వరలో వైసిపిలో చేర్చుకునేందుకు వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. చాలా కాలంగా రాంబాబు పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. టిడిపిలో రాంబాబు ఇమడలేని పరిస్దితులున్నట్లు సమాచారం. వైసిపి ఫిరాయింపు ఎంఎల్ఏ ముత్తుమల అశోక్ రెడ్డితో రాంబాబుకు ఏమాత్రం పడటం లేదు. అదే విషయాన్ని చంద్రబాబునాయుడు వద్ద చెప్పినా ఉపయోగం కనబడలేదు. దాంతో టిడిపిలో ఉండి కూడా ఉపయోగం లేదని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.
ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ ఎంఎల్ఏ తొందరపడుతున్నారు. అందులో భాగంగానే శుక్రవారం మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డితో ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. ఇద్దరూ గంటసేపు మాట్లాడుకున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితుల పై చర్చించుకున్నారు. రాంబాబుతో పాటు నియోజకవర్గంలోని నేతలు కామూరు రమణారెడ్డి, రామనారాయణరెడ్డి తదితరులు రాంబాబుతో పాటు బాలినేనితో సమావేశంలో ఉన్నారు. బాలినేని తో చర్చల తర్వాత సాయంత్రం రాంబాబు ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో కూడా భేటీ అయ్యారు.
ఫిరాయింపు ఎంఎల్ఏ అశోక్
వైసిపిలో భేషరతుగానే చేరుతున్నట్లు రాంబాబు చెబుతున్నా వచ్చే ఎన్నికల్లో గిద్దలూరులో టిక్కెట్టును లక్ష్యంగానే హామీ తీసుకున్నట్లు ప్రచారంజరుగుతోంది. 2009లో ప్రజారాజ్యంపార్టీ తరపున పోటీ చేసిన రాంబాబు గెలిచారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో టిడిపిలో చేరిన అన్నా పోటీ చేసి వైసిపి తరపున పోటీ చేసిన ముత్తుమల చేతిలో ఓడిపోయారు. అయితే, ముత్తుమల టిడిపిలోకి ఫిరాయించటంతో రాంబాబుకు కష్టాలు మొదలయ్యాయి. అశోక్ టిడిపిలోకి రావటాన్ని రాంబాబు ఎంత వ్యతిరేకించినా ఉపయోగం లేకపోయింది. వైశ్య సామాజికవర్గానికి చెందిన రాంబాబుకు గిద్దలూరుతో పాటు మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కూడా పట్టుంది.