ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఏంచేసిందని..ఇప్పుడు ఏదో హడావుడి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ సీనియర్నేత బొత్ససత్యనారాయణ. చంద్రబాబు వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేసిన బొత్స హటాత్తుగా గవర్న్తో భేటీ కావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ అని ప్రశ్నించారు. విభజన జరిగి నాలుగు సంవత్సరాలు అవుతున్నా బీజేపీతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ..ప్యాకేజీలకు ఆశపడి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఊసే తీసుకు రాలేదు. వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బీజేపీతో వైరం పెట్టుకున్నట్లు ప్రజలను నమ్మబలుకుతూ వారితో రహస్య మంతనాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర అభివృద్ధికోసం ఆలోచించని చంద్రబాబు ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారాని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తనపై కేంద్రం చర్యలు తీసుకోనుందన్న సమాచారంతోనే బాబు గవర్నర్ తో భేటీ అయ్యి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ఈ ఎన్నికల తర్వాత సీఎంపై చర్యలు లేకుంటే లాలూచీ పడినట్లేనని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత బిజెపి, టిడిపి లు కలిసి ఏప్రిల్ 30 తిరుపతి సభలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను తప్పారని గుర్తు చేశారు.
అందుకు నిరసనగా ఈ నెల 30ని ”వంచన దినం” గా పాటించనున్నట్లు, ప్రజలు కూడా ఆ రోజు జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్ సీపీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసుంటే ఈ పాటికి కేంద్రం దిగొచ్చేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని టీడీపీ రాజకీయ కుట్రలను తిప్పి కొట్టాలని ఆయన సూచించారు. ఒక్కసారి ఓట్లేసిన పాపానికే బలహీన వర్గాలకు అణగదొక్కుతారా? అని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. జస్టిస్ ఈశ్వరయ్య లేఖపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన బొత్స డిమాండ్ చేశారు.