అవునట! ఆశ్చర్యంగా ఉన్నా నిజమేననే వార్తలు వస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఇంకా కేడరే లేని ఓ పార్టీకి, ఆ పార్టీ అధినేత ఇటు రాజకీయాల్లో ఉంటాడో.. అటు సినీ ఫీల్డ్లో ఉంటాడో కూడా తెలియని పార్టీకి.. అధికార పార్టీలో ఉండి, అందునా ఎమ్మెల్యేగా ఉండి చక్రం తిప్పుతున్నారంటే.. ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కానీ, ఈ వార్తలు నిజమనే అంటున్నారు విశ్లేషకులు కూడా. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ఇటు అధికార పార్టీలో ఉంటూనే అటు జనసేనలోనూ తన దైన స్టైల్లో చక్రం తిప్పుతున్నాడట! కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ నిర్వహిస్తున్న ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో చాలా హుషారుగా తిరుగుతున్నారు.
అదే సమయంలో ఆయన జనసేన కార్యక్రమాలను కూడా చక్కబెడుతున్నారట! అదెలా సాధ్యం అంటే.. బొండాకే తెలియాలి అంటున్నారు సన్నిహితులు. బొండా టీడీపీ నేతే అయినప్పటికీ.. ఆయనకు పవన్తో సాన్నిహిత్యం ఉంది. దీంతో మొన్నామధ్య.. మంత్రి వర్గ విస్తరణ సమయంలో తనకు సీటు దక్కలేదని అలిగిన ఆయన ఇక, టీడీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్తారనే టాక్ వచ్చింది. ఇంతలో మంత్రి దేవినేని ఉమా నేరుగా జోక్యం చేసుకుని సీఎం చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లి బుజ్జగించడంతో బొండా వెనక్కి తగ్గారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
పవన్తో ఎంత సాన్నిహిత్యం లేకపోతే.. బొండా అలా డిసైడ్ అయ్యి ఉంటారని కూడా ఓ టాక్ హల్చల్ చేసింది. ఇక, ఇప్పుడు ఆ చనువే.. బొండాను పవన్కు దగ్గర చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్కి ఇలాంటి నేతల అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల జనసేన పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల దందాలు కూడా నడిచాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు బొండా వంటి వారిని వినియోగించాలని పవన్ భావించాడని, అందుకే జనసేన పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది.
జనసేనాని ఐడియా బాగానే ఉంది. అయితే, బొండా ఉమా చేస్తున్నది కరెక్టేనా? అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఎంత మిత్రపక్షమైనా.. బీజేపీని పక్కన పెట్టలేదా? మరి జనసేనని నెత్తిమీదకి ఎక్కించుకోవడం ఎందుకు? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే, బొండా ఎవరి మాటా వినేరకం కాకపోవడంతో అందరూ మౌనం వహిస్తున్నారు. 2019లో ఎన్నికల నాటి పరిస్థితిని బట్టి ఉంటే టీడీపీ లేదా జనసేన అన్నట్టుగా ఉన్నాడట బొండా! మరి ఏం జరుగుతుందో చూడాలి. రాజకీయాల్లో ఎవరికి ఎవరు సొంతం చెప్పండి!!