తీర నగరం కాకినాడ మేయర్ పీఠం దక్కించుకున్న తెలుగేదేశం పార్టీలో ఆనందం ఇసుమంతైనా కనిపించడంలేదు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని రోజుల తరబడి కాలినడకన నగరం మొత్తం చుట్టేసి ప్రజలను మచ్చిక చేసుకుని మేజర్ వార్డులు సొంతం చేసుకున్న టీడీపీలో ఇప్పుడు మేయర్ పీఠం అంతర్గత చిచ్చును రాజేస్తోంది! విషయంలోకి వెళ్తే.. కాపులు తమకు ఎక్కడ దెబ్బేస్తారోనని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడ తాము గెలిస్తే.. మేయర్ పీఠాన్ని మహిళకు అదికూడా కాపు వర్గానికి చెందిన వారికే కేటాయిస్తానని హామీ ఇచ్చరు. దీంతో కాపు వర్గం నుంచి నలుగురు మహిళలు మేయర్ పీఠం కోసం నానా సిఫార్సులు చేయించు కుంటున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే కొండబాబు సైతం రంగంలోకి దిగి.. మేయర్ పీఠంపై జరుగుతున్న లావాదేవీల విషయంలో ఫైరైపోతున్నారు.
2014లో వైసీపీలో ఉండి.. ఇటీవలసైకిలెక్కిన కొందరు నేతలు ఈ పీఠాన్ని దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ పదవిని పార్టీ విధేయులకు ఇవ్వాలే తప్ప పార్టీకి వెన్నుపోటు పొడిచి 'జగన్' పార్టీ నాయకులతో లోపాయికారీ సంబంధాలు ఉన్నవారికి ఇవ్వకూడదని ఏకంగా చంద్రబాబును కలసి ఫిర్యాదు చేయడం వరకు విషయం వెళ్లిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడులకు ఇద్దరు మహిళలు విజ్ఞప్తిచేశారు. అయితే, వీరిలో ఒకరు వైసీపీ అనుకూలంగా 2014లో ఉన్నారని, అంతేకాకుండా తన గెలుపునకు కూడా అప్పట్లో అడ్డుపుల్ల వేశారని ఇలాంటి వారికి ఇవ్వడం సమంజసం కాదని కొండబాబు అంటున్నారు.
అంతేకాదు, అసలు ఈ మేయర్ ఎన్నిక విషయాన్ని స్థానికంగా గట్టి పట్టున్న తనకు ఎందుకు ఇవ్వడం లేదని కూడా కొండబాబు అధిష్టానం వద్ద ప్రశ్నించారని తెలుస్తోంది. వైసీపీ వ్యాపార లావాదేవీలు, రాజకీయంగా ఆర్థిక లావాదేవీలు ఉన్నవారికి మేయర్ పదవికి ఎలా సిఫార్సు చేస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. ``మేయర్ పదవి మీ ఇష్టం వచ్చిన వారికి ఇవ్వండి.. ఫలానా వారికి ఇవ్వమని నును సిఫార్సు చేయను. కానీ మేయర్ పదవిలో ఎంపికైన వారి భర్తలు వారి అధికారంలో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు`` అని కూడా కొండబాబు చెబుతున్నారు.
ప్రస్తుతం కాకినాడ మేయర్ పీఠం.. తోట నరసింహం వర్గానికి చెందిన వారికి ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తనకు తెలుస్తోందని, కానీ, వీరు 2014లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారన్న విషయాన్ని గుర్తించాలని కోరుతున్నారు. ఇదిలావుంటే, చినరాజప్ప, యనమలతో పనికాదని భావిస్తున్న ఆ ఇద్దరు మహిళలు .. తాజాగా మంత్రులు కళా వెంకట్రావు, పి.నారాయణలను ఆశ్రయించారని కొండబాబు చెబుతున్నారు.
వీరిద్దరూ బాబుకు అత్యంత సన్నిహితులు కావడంతో బాబు ఎవరో ఒకరి మాటకు విలువ ఇచ్చి ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయొచ్చని సమాచారం. అయితే, వీరిద్దరూ కూడా గతంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారని కొండబాబు ఆరోపిస్తున్నారు. తనను ఓడించడానికి ట్రై చేసిన వారికి మేయర్ పీఠం ఇవ్వాలని చేస్తోన్న ప్రయత్నాలు ఆయన్ను తీవ్రంగా హర్ట్ చేశాయని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మేయర్ పీఠంపై చంద్రబాబు మరింత అధ్యయనం చేయాలని డిసైడ్ అయినట్టు అమరావతి వర్గాలు చెబుతున్నాయి.