`ప్రచారానికి రండి. మా తరఫున ప్రచారం చేయండి. మాకేం అభ్యంతరం లేదు. కానీ.. ఏం చేసినా కండువాలు వేసుకోకుండానే రండి` అంటూ బీజేపీ నేతలను నంద్యాలలో ప్రచారానికి ఆహ్వానిస్తూనే మెలిక పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు!! దీనిపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే వీరంతా తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మిత్ర ధర్మం పాటించడం లేదని అగ్గిమీద గుగ్గిలం అవుతుంటే.. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ ఊహించని షాక్ ఇచ్చింది. పుండు మీద కారం చల్లిన చందంగా టీడీపీ వ్యవహరిస్తుండటం.. బీజేపీకి నిద్రపట్టకుండా చేస్తోంది. నమ్మకంగా తమకు దెబ్బేస్తోందని కాషాయ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మిత్ర ధర్మాన్ని టీడీపీ పాటించలేదని బీజేపీ నేతలు వాపోతున్నారు. కార్పొరేషన్లో 48 వార్డులు ఉన్నాయి. ఇందులో తొమ్మిది వార్డులను బీజేపీకి కేటాయించింది టీడీపీ. కానీ మిత్రధర్మం అంటూనే టీడీపీ అభ్యర్థులు కూడా అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. వీరు నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో.. బీజేపీ అవాక్కయింది. పొత్తు ప్రకటించి 9 స్థానాలు తమకు ఇచ్చి అన్న చోట్ల రెబల్స్ ను దించి పచ్చ పార్టీ వెన్నుపోటు పొడిచిందని సాక్షాత్తూ కమలం తరపు మంత్రాంగం చేస్తున్న విష్ణు కుమార్ రాజు ఆరోపించారు .
దీనివల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ-బీజేపీ సంబంధాలు ఇరు పార్టీల్లో కల్లోలం సృష్టించే పరిస్థితే కనిపిస్తుంది . ప్రస్తుతం టీడీపీ-బీజేపీ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఒకపక్క వైసీపీతో మిత్రత్వం కోసం బీజేపీ నేతలు ఆరాటపడుతున్నారనే సంకేతాలు టీడీపీ అధిష్ఠానం వరకూ వెళ్లాయి. దీంతో బీజేపీతో కఠినంగా వ్యవహరించాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే టీడీపీ అభ్యర్థులను రెబల్ అభ్యర్థులుగా నిలబెట్టిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
ఇక వైసీపీకి కూడా 30 చోట్ల సుమారుగా తలపోట్లు తలెత్తుతున్నాయి . వీరంతా టికెట్లు ఆశించి నామినేషన్లు వేసి ఉపసంహరణ పూర్తి అయినా బరిలో నిలిచిపోవడంతో వైసీపీకి గెలుపు అంత ఈజీ కాదనే వాదన విశ్లేషకులు చేస్తున్నారు . సాక్షాత్తు రాజ్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నా ఈ పరిస్థితి తలెత్తడంతో అభ్యర్థులు సగం మందికి పైగా ప్రచారం కన్నా బుజ్జగింపు ఘట్టాలకు సమయం ఎక్కువ కేటాయించక తప్పడం లేదు . ఇక ప్రచారానికి వారం కూడా సమయం లేని నేపథ్యంలో ఇరు పార్టీలకు ఈ అంశం చెమటలు పట్టిస్తోంది.