తెలుగు దేశం పార్టీ భారీ గా ఏర్పాటు చేసి, అంగరంగ వైభోగంగా, పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం మహానాడు. ఈ కార్యక్రమం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు జాతి గర్వపడే తెలుగు నటులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి నాడు ఏర్పాటు చేయడం ఆ పార్టీ కి అనవాయితి గా మారింది. అయితే ఇందులో పార్టీ కార్యకర్తల నుంచి ముఖ్యనేతలందరూ హజరవుతారు. అంతేకాదు నందమూరి ప్యామిలీ కూడా హజరవుతారు కానీ, గత మూడేళ్లుగా వారు కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక తాతయ్య పేరు పెట్టుకుని ఆయన నుంచి అవభావాలను పునికి తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఆయన తండ్రి హరికృష్ణ, బాలకృష్ణ లాంటి వారు కూడా మహానాడు సమయంలో గుర్తుకు చేసుకోవాల్సిందే. తెలుగు దేశం జనాలకు కాకపోయినా. మీడియాకు ఖచ్చితంగా గుర్తుకు వచ్చేవారు. ఆహ్వానం అందిందా? వెళ్తారా ? వెళ్లరా ? అన్న సందేహాలు ఉంటాయి. ఎలాగు బాలయ్య బాబు వెళాల్సిందే ఎందుకంటే టీడీపీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. పైగా బావ మాట జవదాటే వ్యక్తిత్వం కాదు. ఆయన ఏదంటే అదే సై అంటారు. కానీ మిగతా ఇద్దరి వ్యక్తిత్వం వేరు.
జూ. ఎన్టీఆర్ పార్టీకి దూరమైనట్లే....
కానీ ఈ ఏడాది దాదాపుగా మీడియా జూనియర్ ఎన్టీఆర్ సంగతే మరిచిపోయింది. ఆయన కూడా సింపుల్ గా నిన్నటికి నిన్న తాత ఎన్టీఆర్ కు నివాళి అర్పించేసి చెన్నై కి చెక్కెసారు. లోకల్ లో లేరు కాబట్టి, ఇక పిలిచారా? పిలవలేదా? వస్తారా? రారా? అన్న పాయింట్లే గుర్తుకు రావు. ఇప్పుడు నందమూరి వంశం తరపున ఏకైక ప్రతినిధి బాలయ్య మాత్రమే. తరువాత ఆ వారసత్వం ప్లస్ నారా వారసత్వం అందుకునేందుకు లోకేష్ రెడీగా ఉన్నారు. అందువల్ల ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కి పూర్తిగా దూరమైనట్లే అనుకోవాలి. లోకేష్ ఇప్పటికే పార్టీ లో కీలకంగా వ్యవహారిస్తున్నారు. ఇక బాలకృష్ణ -హరికృష్ణ కొంచెం దూరంగా ఉంటున్నా వారి డిమాండ్ లో మాత్రం ఒకటే వాదన వినిపించారు. రాజకీయంగా ఒకే రకమైన ఆశయంతో ఉన్నా... వేరు వేరు కారణాలతో విడిపోవాల్సి వచ్చింది.ఒకరు పార్టీ అధినేతకు దగ్గరవుతున్న కొద్దీ... మరొకరు పార్టీకి దూరంగా ఉండిపోతున్నారు. తాము దూరంగా ఉన్నా... తమ ఆలోచనలు- భావాలు ఒక్కటే అని మరోసారి వీరు నిరూపించారు.
ప్రత్యేక హోదా పై వారిద్దరి డిమాండ్ ఒకటే...
ప్రత్యేక హోదా విషయంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఒకరు మహానాడు వేదికగా హోదా గురించి మాట్లాడితే...మరొకరు ఎన్టీఆర్ ఘూట్ వద్ద తెలుగు ప్రజల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ప్రత్యేక హోదా అన్నది ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలో పొందు పరిచిన ఆంశం. అయితే దీనికి అధికారం లో ఉన్న ఎన్డీఏ సర్కార్ అడ్డుకుంటోంది. అయితే ఈ విషయాన్ని మిత్ర పక్షం గా ఉంటున్న తెలుగు దేశం జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సైతం అంతగా పట్టించుకోవడం లేదన్న వాదన ఉంది. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా అంశం మహానాడు లో చర్చకు వేదికైంది. ఆనాడు ఇస్తామని చెప్పిన నేతలే... ఇప్పుడు లేదు ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీనిపై తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. మళ్లీ ప్రత్యేక హోదా గురించి ఉద్యమాలు వచ్చేలా ఉన్నాయి పరిస్థితులు. అయితే ఈ విషయం పై బాలకృష్ణ- హరికృష్ణ లు కలిసికట్టుగా డిమాండ్ చేశారు. అన్న నిరసన గళంతోనూ తమ్ముడు సామరస్య పూర్వక ధోరణితోనూ ఎవరిపంథా లోల వారు కేంద్రాన్ని కోరారు.
ఉద్యమానికి పిలుపునిచ్చిన హరికృష్ణ....
బాలకృష్ణ మహానాడు వేధిక గా ప్రత్యేక హోదా ను ఇవ్వాలని ఢిల్లీ లో ఉన్న కేంద్రాన్ని కోరడం, ఇక మహానాడు గైర్హాజరై ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చిన హరికృష్ణ ... ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సందేనని పిలుపునివ్వడం, ఏపీ ప్రత్యేక హోదా వచ్చిన నాడే ఎన్టీఆర్ కు సరైన నివాళులని పేర్కొన్నారు. ఏపీ కి ప్రత్యేక హోదా కోసం ప్రతిఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉదన్న హారికృష్ణ... ఒక విలువైన మాటను చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలంతా కలిసి పోరాటం చేయాలని... ప్రతి ఇంటి నుంచి ఒకరైనా బయటకు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా మీద సమరం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు వాడైన ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కోసం శపధం చేయాలని కోరారు. అంతాబాగానే ఉంది కానీ, గడిచిన రెండేళ్ల కాలంలో ప్రత్యేక హోదా గురించి పెద్దగా నోరు విప్పని హరికృష్ణ కు ఉన్నట్టుండి ప్రత్యేక హోదా విషయంఎందుకు గుర్తుకు వచ్చినట్లు అన్నది ఒక ప్రశ్న. ప్రత్యేక హోదా మీద పోరాటానికి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒకరు చొప్పున అయినా రోడ్డు మీదకు రావాలని గళం విప్పాలని, పోరాటం చేయాలని హరికృష్ణ చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఫ్యామిలీ నుంచి ఎంతమంది బయటకు వస్తారో చెబితే బాగుండేదేమో...!
జూ ఎన్టీఆర్ ఎంట్రీతో లోకేష్ కు బ్యాండే....
మొత్తమీద బాలకృష్ణ- హరికృష్ణ లిద్దరు ఏపీ లో పెద్ద సమస్యగా మారిన ప్రత్యేక హోదా పై ఒకే గళం వినిపించడం మంచి పరిణామమే. వీరి మధ్య అంతర్గతంగా విబేధాలున్నా ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ఇలా ఒక్కటయ్యారు. మరి ఇద్దిర సమస్య పై బావ గారైన ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయానికి శ్రీకారం చుట్టనున్నారో చూడాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ దాదాపుగా పార్టీ కి దూరంగా ఉంటునే వస్తున్నారు. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. కావాలనే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను దూరంగా పెడుతున్నట్లు తెలుస్తోంది! కొడుకు నారా లోకేష్ ను పార్టీలో ని వారసత్వ నాయకుడిగా ఎదిగేవిధంగా బాబు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో జూ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానిస్తే మొదటికే మొసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కు భారీ క్రేజ్ ఉంది. ఆయన మాట తీరు, నడవడిక అచ్చం పెద్ద ఎన్టీఆర్ ను పోలి ఉంటాయి. జూ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే లోకేష్ బ్యాక్ కావడం ఖాయం కాబ్బటి, సమయంలో చూసి అవసరాన్ని బట్టి ఎన్టీఆర్ ను వాడుకోవాలన్న భావనలో చంద్రబాబు అండ్ కో ఉన్నారు.
2019 నాటికి చంద్రబాబు-లోకేష్ కాంబినేషన్ లోనే తెలుగు దేశం ఎన్నికల ఫైట్ ఉంటుంది గెలిచిందా మళ్లీ వారే, ఓడినా మళ్లీ వారే, ఓడినంత మాత్రన ఎన్టీఆర్ ను పిలచి పీట వేస్తారనుకొవడం భ్రమే. అందు వల్ల ఇప్పట్లో ఎన్టీఆర్ కు ఎంట్రీ వుండదు. సో బహుశా అందుకే మీడియా కూడా ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం విషయంలో అన్నీ పక్కన పెట్టేసినట్లుంది. అంటే దాదాపుగా నందమూరి వారసత్వం ఇక తెలుగు దేశం పార్టీలో ఉండదనే భావనలో వారు ఉన్నారు. అందుకే బాలయ్య-హరికృష్ణ లు ప్రత్యేక హోదా మంత్రం అందుకున్నారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. మరీ ప్రత్యేక హోదా వ్యవహారం తెలుగుదేశం పార్టీని ఏ దిశ ను నడిపిస్తుందో చూడాలి...!