తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపులు పెద్ద ఎత్తున జరుగడంతో రాజకీయ శూన్యత ఏర్పడినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ని ప్రశ్నించే బలమైన ప్రతిపక్షం పార్టీ లేకుండా పోయిందని, ఇందు కోసం ఓ కొత్త పార్టీ రావాలని బహిరంగంగానే ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. గులాబీ ఆదినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ చతురత తో శాసన సభ్యులను, నాయకులను పార్టీలు మార్పించి టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను బలహీన పర్చారు. కోలుకోలేని దెబ్బ తీశారు. ప్రజలు ఈ పార్టీలపై విశ్వాసం కోల్పోయే విధంగా చేశారు. దీనితో ప్రస్తుతమున్న రాజకీయ పార్టీలపై ప్రజలకు విశ్వాసం పోయింది. ఇది రాజకీయాలలో కొత్త పరిణామం, ఫిరాయింపు దారులకు ఆస్కారం లేని కొత్త పార్టీని బలమైన నాయకత్వంలో ఏర్పాటు చేయవలసిన అవసమున్నట్లు భావిస్తున్నారు. కేసీఆర్ ప్రతి అడుగు రాజనీతి తో వేస్తున్నారు. తన పార్టీని బలోపేతం చేయడం ఒక భాగమైతే ప్రతిపక్ష రాజకీయ పార్టీలను బలహీన పర్చడం మరొక భాగంగా పావులు కదుపుతున్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ !
రాష్ట్రంలో కేసీఆర్ సరితూగగల నాయకులు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలలో కనిపించడంలేదని అంచనా! టీడీపీ పార్టీని కేసీఆర్ మొదట టార్గెట్ చేసుకుని తన రాజకీయ చతురతతో కకావికలం చేశారు. ఆ పార్టీ నుంచి గెలిచిన 15 మంది శాసన సభ్యులలో ఫోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు తో సహా 12 మందిని విలీనం చేసుకున్నారు. జిల్లా స్థాయి-నియోజకవర్గం స్థాయి- జేడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థాయి నాయకులు 90 శాతం మంది టీఆర్ఎస్ లో కలిశారు. అక్కడక్కడ కొద్ది మంది మిగిలారు. గ్రేటర్ హైదరాబాద్ లో బలంగా ఉందనుకున్న టీడీపీ ని టార్గెట్ చేసుకుని స్థానిక ఎన్నికలలో మట్టి కరిపించారు, అడ్రస్ లేకుండా ఓడించారు. ఓటు నోటు కేసులో చంద్ర బాబును ఇరికించి నోరు మెదపకుండా చేశారు. చివరకు హైదరాబాద్ నుండి విజయవాడకు మకాం మార్పించారు. టీడీపీ రోజు, రోజుకు బలహీన పడుతుంది. పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు నాయకులంతా పార్టీ పరిస్థితి గమనించి తమ ఉనికి కోసం, ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నారు. పార్టీ కేడర్ అంతా అయో మయంలో కొట్టమిట్టాడుతోంది.
పార్టీలో పబ్లిక్ ఇమేజ్ గల నాయకులు ఎవరూ లేరు. నమ్మకం కలిగించే నాయకత్వం కలిపిస్తే పార్టీకి పునర్వైభవం వస్తుందనడంలో సందేహం లేదు. ఇక తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు ఆశించినంత వేగంగా పుంజుకోవడం లేదు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత దిగజారింది కానీ, తెలంగాన లో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తేవాలని శ్రీమతి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పట్టుదలతో ఉన్నారు. అయితే ఇక్కడ నాయకత్వం కేసీఆర్ వ్యూహంలో విల విల లాడుతున్నారు. 6 గురు శాసన సభ్యులు పార్టీ విడిచి వెళ్లారు. శాసన మండలి సభ్యులు 7 గురు వెళ్లారు. ఇంకా కొంత మంది వెళ్లడానికి క్యూ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా ఉద్యమాలకు స్పందించి సోనియాగాంధీ చొరవ చూపి తెలంగాణ ఇచ్చారు కానీ, తెలంగాణలో కాంగ్రెస్ రాలేదు. ఆంధ్రా లో అడ్రస్ లేకుండా పోయింది. సమీప భవిష్యత్తులో ఆంధ్రా లో అధికారం లోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు. ఇకపోతే ఎలాగైనా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ గెలిచి టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని ఆ పార్టీ నాయకత్వం దృఢ నిశ్చయం తో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం బాగా పుంజుకునే అవకాశం ఉంది.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కి
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కి అన్యాయం చేశానే భావన ప్రజలలో కొంత వరకు ఉంది. టీఆర్ఎస్ మీద వచ్చే వ్యతిరేకత కారణంగా క్రమ, క్రమంగా కాంగ్రెస్ బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే స్థానిక నాయకత్వం బలంగా లేదు. భవిష్యత్ లో బీజేపీ మీద గల వ్యతిరేకతతో కమ్యూనిస్టు పార్టీలు- ముస్లింలు, దళితులు-క్రిష్టియన్లు కాంగ్రెస్ కు మద్దతు నిచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అండదండగా బలమైన ఒక సామాజిక వర్గం ఉంది. తెలంగాణ వస్తే తమ సామాజిక వర్గం చేతుల్లోకి అధికారం వస్తుందని వారు ఆశించారు. రాకపోయే సరికి ఈ సామాజిక వర్గమంతా చాపకింద నీరులా ఏకం కావడానికి అంతరంగిక సమావేశాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంకొక వైపు తెలంగాణ కోసం పోరాడిన శక్తులు- సామాజిక న్యాయం కోసం పోరాడే శక్తులు రెండు భాగాలుగా విడిపోయి పోరాడుతున్నారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి నాయకత్వాన్ని డా. లక్ష్మణ్ చేపట్టారు. అధ్యక్ష పీఠం వహించారు. ఆయన బీసీ నాయకుడు. అందరిని కలుపుకు పోయే మనస్తత్వం గల వాడుగా ఆయనకు మంచి పేరుంది.
ఎలాగు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అది ఇక్కడ, కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? లేదా అనేది పార్టీకి కార్యక్రమాలను బట్టి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇక ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. మిగతా జిల్లాల్లో పార్టీ కేడర్ ఉంది. బలమైన అనుబంధ సంఘాలు ఉన్నాయి. గెలుపు- ఓటములు శాసించే స్థాయిలో ఉన్నారు. అయితే వీరు కేసీఆర్ స్వయంగా ఓడించే స్థితి ఎదగ లేదు. ఇతర పార్టీలు ఎదిగితే వారితో పొత్తు లేదా అవగాహన కు వచ్చే అవకాశం ఉంది. ఇతర పార్టీలను ఓడించే సత్తా కమ్యూనిస్టులకు ఉంది. ప్రత్యామ్నాయంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ కూడా వేగవంతంగా జరుగుతున్నది. కేసీఆర్ వ్యతిరేక శక్తులు రెండు గ్రూపులుగా ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంగా బలపడడానికి ప్రయత్నిస్తున్నది. ఇంకొకటి తెలంగాణ కోసం త్యాగాలు చేసి పోరాడిన వారికి అన్యాయం జరిగిందనే వాదనతో ఈ శక్తులను ఏకం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇందులో ప్రధానంగా తెలంగాణ కోసం పోరాడి జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఆధ్వర్యంలోని తెలంగాణ జాక్, అలాగే చెరుకు సధాకర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ వేదిక జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వాన సోషల్ జస్టిస్ ఫ్రంట్ గా ఏర్పడి పెద్ద ఎత్తున సభలు- సమావేశాలు జరుపుతున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రాంతీయవాదంతో జరిగింది. ప్రాంతీయ వాదం కంటే మతవాద బలమైంది. మతవాదం కంటే కులవాదం శక్తివంతమైంది. ఇదే బీహార్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడులలో కనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమం తరువాత మన రాష్ట్రంలో సామాజిక తెలంగాణ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ లు ఉద్యమం కోసం పరుగులు తీస్తున్నారు. ఈ ఉద్యమం రేపు రాజ్యాధికారం దిశగా పయనించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అభివృద్ధి కంటే సెంటీమెంట్ కే ప్రాధాన్యత ఇస్తారు. కులవాదం బలపడితే అన్ని వాదాలు వెనక్కు పోతాయి. ఎలాంటి ఎత్తులు జిత్తులు పనిచేయవు. ఎన్నికల సమయంలో టికెట్ రాని అభ్యర్థులంతా అధికార పార్టీకి ఎదురుతిరిగి పోటీ చేస్తారు. ఇవన్నీ కొత్త రాజకీయ పార్టీకి అనుకూల అంశాలు. మొత్తం తెలంగాణలో కొత్త గా వచ్చే పార్టీలకు మంచి అవకాశమనే చెప్పాలి.