'బాబు'గోరు చేయాల్సినవి చాల ఉన్నాయి !
రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సర్వసాధారణం.. ఓడిపోయినప్పుడు ఒంటరిగా మిగలడం.. గెలిచినప్పుడు గుంపులుగా తోడు నిలవడం చాల సహజమైన విషయాలు. అయితే గెలిచినప్పుడు తన గొప్పగా.. ఓడినప్పుడు అది సహజం అన్నట్లు నాయకులు ఫీల్ అవుతుంటారు. అలాంటి ఫీలింగ్స్ లో మన బాబుగారు మాస్టర్ డిగ్రీ చేశారు. ఏది ఏమైనా మళ్లీ గెలిచేదాకా పనిచేయడం బాబుకి వ్యసనం. ప్రస్తుతం ఆ గెలుపు కోసమే జగన్ ప్రభుత్వం పై ఈ మధ్య బాబు పదునైన ఆరోపణలను చేస్తూ ముందుకు పోతున్నారు బాబుగారు. పైగా తెలుగు తమ్ముళ్ళో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో ఎక్కడా శాంతి భద్రతలు లేవని.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి పనులను, జగన్ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లడం లేదని.. పైగా 'వైసీపీ ప్రభుత్వ తీవ్రవాదమని' పారిశ్రామికవేత్తలు కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని బాబు చెబుతున్నారు. ఇలాంటి ఆరోపణలు అయితే బాబు చేస్తున్నాడు గాని.. మరి బాబుకి ఇవ్వన్నీ ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి అలుపెరుగని సేవలు చేసిన కార్యకర్తలు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.
అయినప్పటికీ బాబుగారు ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని చేసిన తప్పులను సవరించుకుని పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లకుండా.. లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీ బలహీనతల పై పాలనలో జరుగుతున్న లోపల పై బాబు ప్రజలకు అవగాహన కల్పించకుండా సోషల్ మీడియాలో పోస్ట్ లతో సరిపుచ్చుతున్నారు. అన్నిటికి మించి తమ బలాలను తమ నాయకులతో పాటుగా కార్యకర్తలకు అర్ధం అయ్యేలా చెప్పి.. అవసరం మేరకు వారి చేత పార్టీ సిద్దాంతాలను అమలు చేసే విధంగా ముందుకు సాగాలి బాబుగారు. అలాగే నాయకత్వ లోపం లేకుండా.. ప్రతి ఏరియాకి యాక్టివ్ గా ఉండే ఒక నాయకుడ్ని పెట్టాలి. ఇలా వచ్చే ఎన్నికల నాటికీ ఇలా ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తే.. బాబు మళ్ళీ సీఎం అవ్వొచ్చు. అలా అవ్వాలంటే బాబు ముందు తన పబ్లిసిటీ మీద కాకుండా.. ప్రజా సమస్యల పైన పోరాటం చేయగలగాలి. అలా చేయాలని తెలుగు తమ్ముళ్లు బలంగా కోరుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతూ ఉండాలి. గత ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకు తేడా అంశాలను నోట్ చేస్తూ అప్పుడప్పుడూ నాయకులతో అధినేత సమీక్షలు జరపాలి. ఇవన్నీ బాబు ప్రస్తుతం చేస్తున్నారుగా అనకుండా.. ప్రతి ఏరియాలోకి వెళ్లేలా చేసుకుంటూ పోవాలి. అలాగే అందరికీ తమ ఆలోచనలు పంచుకునేందుకు, పార్టీలోని లోటుపాట్లు గురించి ఫిర్యాదు చేసిందుకు అందరికి అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు అసంతృప్తితో కొట్టుమిట్టాడుకుండా వారికీ భవిష్యత్తు పై భరోసా ఇవ్వాలి.