ప్రముఖ టీవీ ఛానల్ టీవీ9 కీలక ప్రకటన చేసింది. టీవీ9 చేతిలో ఎమ్మెల్యేల నేర చరిత్ర చిట్టా పేరుతో కీలక కథనం ప్రసారం చేసింది. ఉద్యమ కేసుల కొట్టివేత తర్వాత ఎమ్మెల్యేలపై నమోదైన కేసులు అంటూ వివరాలు ప్రసారం చేసింది. ఆర్టీఐ ద్వారా ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తీసుకున్న వివరాలు పేర్కొంటూ ఈ కథనం ప్రస్తావించింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విచారణకు తెలంగాణాలో ప్రత్యేక కోర్టును సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిందని తెలిపింది.
ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ను ప్రస్తావిస్తూ....టీవీ9 ప్రసారం చేసిన కథనం ప్రకారం....అందులో అత్యధికంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై 17 కేసులు ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై 7 కేసులు, ఎంఐఎం నేత, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ పై 6 కేసులు ఉన్నాయని తెలిపింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఫైర్బ్రాండ్ నేత జగ్గారెడ్డిపై 5 కేసులు ఉన్నాయని వివరించింది. మాజీ స్పీకర్ మధుసూధనాచారిపై 3 కేసులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధాస్యం వినయ్ భాస్కర్ పై 3 కేసులు ఉన్నాయని కథనం పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పై 4 కేసులు, మంత్రి తలసాని పై 3 కేసులు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై 3 కేసులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్నపై 3 కేసులు ఉన్నాయని వివరించింది. మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యపై 5 కేసులు ఉన్నాయని తెలిపింది. ఎమ్మెల్యేలపై నమోదు అయిన కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలని గవర్నర్కు లేఖ రాసినట్లు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది.
అయితే, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెలువరించిన ఈ సమాచారం, టీవీ9 కథనంలో పేర్కొన్న వారి గురించి ఆయా ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందించనున్నారు? గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనేది ఆసక్తికరమైన అంశం.