అడవుల పెంపకంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని అటవీభూములు చెట్లు లేని ఎడారుల్లా మారిన దుస్థితి ఉండేదన్నారు. అటవీభూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలుచేసినట్లు వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సింగాయిపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలెక్టర్లకు అడవుల పెంపకంపై హితబోధ చేశారు.
గజ్వేల్ ప్రాంతంలో మూడేళ్ల క్రితం ప్రారంభమైన అటవీ పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతున్నదని, వర్షపాతం కూడా పెరిగిందని చెప్పారు. 27 రకాల పండ్ల మొక్కలను ఈ అడవుల్లో పెంచడం వల్ల ఇవి మంకీ ఫుడ్కోర్టుల్లా తయారవుతున్నాయన్నారు. గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని, ఇది మన భూభాగంలో 23.4 శాతం అని సీఎం అన్నారు. ఇంత అటవీభూమి ఉన్నప్పటికీ అదే నిష్పత్తిలో అడవులు లేవని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీభూమి ఉన్నప్పటికీ ఆ నిష్పత్తితో అడవులు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఈ స్థాయిలో అడవులను పునరుద్ధరించాలని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీభూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించారు. సామాజిక అడవుల పెంపకం ఆవాసప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే.. అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవటానికి, జీవవైవిధ్యానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.