కందుకూరు రాజకీయాల్లో మానుగుంట మిస్టరీ – జగన్‌కు షాక్!

Amruth kumar
కందుకూరు మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పేరు ఇప్పుడు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పార్టీలో ఉన్నారా? లేక బయటకెళ్లిపోయారా? అన్న సందేహం ఇప్పుడు వైసీపీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం, ప్రజా సమావేశాల్లో పాల్గొనకపోవడం, వైసీపీ ఈవెంట్స్‌లో కనిపించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది. మానుగుంట మహీధర్ రెడ్డి పేరు కందుకూరు రాజకీయాల్లో ఒక పెద్ద బ్రాండ్‌. ఆయన కుటుంబం ఈ నియోజకవర్గానికి దశాబ్దాలుగా రాజకీయ పట్టు కలిగినది. ఆయన తండ్రి మానుగుంట ఆదినారాయణ రెడ్డి 1972లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 1983, 1985లో కూడా తెలుగుదేశం అలజడి మధ్య ఆదినారాయణ రెడ్డి గెలవడం మానుగుంట ఫ్యామిలీ ప్రభావాన్ని స్పష్టంగా చూపించింది.

అదే పంథాలో మహీధర్ రెడ్డి కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఈ ఫ్యామిలీ పేరు చెప్పగానే కందుకూరులో ఇప్పటికీ రాజకీయ వేడి పుడుతుంది. కానీ గత ఎన్నికల్లో పెద్ద ట్విస్ట్ జరిగింది. జగన్‌ కందుకూరు టిక్కెట్‌ను మానుగుంట మహీధర్ రెడ్డికి ఇవ్వకుండా బుర్రా మధుసూదన్ యాదవ్‌కి ఇచ్చారు. ఆయనను కనిగిరి నుంచి మార్చి కందుకూరులో బరిలోకి దించారు. ఈ నిర్ణయంతో మహీధర్ రెడ్డి పూర్తిగా నిరాశ చెందారట. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరమై, ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. పార్టీ నేతలు పలు మార్లు ఆయనతో సంప్రదించడానికి ప్రయత్నించినా, ఆయన స్పందన చాలా చల్లగా ఉందని సమాచారం. ఇటీవల జగన్‌ కూడా స్వయంగా మానుగుంట మహీధర్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించారని, కానీ ఆయన మర్యాదపూర్వకంగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారని చెప్పుకుంటున్నారు.

అంతేకాకుండా కందుకూరు నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న హత్య కేసులో కూడా ఆయన ఎక్కడా కనిపించకపోవడం, ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది. వైసీపీలో ఆయన లేరు అని అధికారిక ప్రకటన లేకపోయినా, "మహీధర్ రెడ్డి సైలెంట్‌గా రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారా?" అన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది. ఆయనకు ఉన్న కుల, కుటుంబ బలం, కందుకూరులో ఉన్న సీనియర్ లీడర్‌షిప్ కారణంగా వైసీపీకి ఆయన లాంటి నేతను కోల్పోవడం పెద్ద నష్టం అవుతుందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇక ప్రశ్న ఒక్కటే – మానుగుంట మహీధర్ రెడ్డి తిరిగి రాజకీయ రంగంలోకి వస్తారా? లేక పూర్తిగా ఆధ్యాత్మిక దారిలోనే ముందుకెళ్తారా? అన్నది రాబోయే నెలల్లో తేలనుంది. కానీ ఇప్పటికి మాత్రం కందుకూరు రాజకీయాల్లో ఆయన గైర్హాజరీనే చర్చనీయాంశం..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: