మదనపల్లె ఫైల్స్: అసలు పెద్దిరెడ్డికి అంత సీన్ ఉందా?
ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 22 ఏ సెక్షన్లో మంటలు వ్యాపించాయి. దాదాపు 25 విభాగాల్లోని ఫైళ్లు దగ్ధం అయ్యాయి. అయితే అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ అని తొలుత భావించినా.. కాదని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ ఘటన పట్ల సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు డీజీపీ ద్వారకా తిరుమల రావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ లు ప్రత్యేక హెలీకాఫ్టర్ లో సంఘటనా స్థలికి చేరుకున్నారు. మూడు గంటల పాటు పరిశీలించి ప్రమాదం కాదని తేల్చారు.
అయితే ఈ వ్యవహారంలో మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర గురించే చర్చ అంతా జరుగుతూ ఉంది. కారణం ఆయనకు సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం, అత్యంత కీలకమైన నిషేధిత భూముల జాబితా సెక్షన్లోనే మంటలు వ్యాపించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒక సంస్థ ఏరియాలోని ఫైళ్లకు సంబంధించిన బ్యాకప్ ఉంటుందని చెబుతున్నారు. పెద్ది రెడ్డి , అతని అనుచరులు భూములు దోచుకున్నారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే నిజం అయితే చట్టబద్ధంగా భూములు కొంటే నేరం ఎలా అవుతుందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి ఏం ఫైళ్లు తగలబెట్టారు. ఈ ఘాతుకానిక ఎవరు పాల్పడ్డారు అనేది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చే వరకు ఎవరికీ తెలియదు. కానీ అప్పటి వరకు రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వస్తుంటాయి.