విజయసాయి కొత్త ఛానెల్... ఆ వైసీపీ నేతలకు మూడినట్టే..?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నంతపని చేసేలా ఉన్నారు. కొత్త న్యూస్ ఛానల్ ఏర్పాటుకు తెరవెనక కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి తాను కొత్త న్యూస్ ఛానల్ పెడతానని విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే కొత్త న్యూస్ ఛానల్ పెట్టడం కంటే ఇప్పుడున్న పరిస్థితులలో మరో కొత్త ఐడియాతో ఆయన మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఓ ఛానల్ కు చెందిన వ్యక్తితో విజయసాయిరెడ్డి చర్చలు పూర్తయ్యాయని భారీ ప్యాకేజీ తో ఆయన ఛానల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్టు మీడియా సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే దసరా నాటికి ఛానల్ ప్రసారాలు ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
అయితే సాక్షి ఉండగా విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా ఛానల్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల దేవాదాయ శాఖ అధికారిణి శాంతి - విజయసాయిరెడ్డి ఎపిసోడ్లో విజయ్ సాయి రెడ్డికి మీడియాలో తీవ్రంగా వ్యతిరేక ప్రచారం జరిగింది. అయినా సాక్షి నుంచి ఆయనకు మద్దతుగా కనీస ప్రసారాలు కూడా రాలేదు. దీని వెనక ఎవరి హస్తం ఉందన్నది విజయసాయిరెడ్డి గ్రహించారని అంటున్నారు. తనపై ఆరోపణలు రావడానికి సొంత పార్టీ నేతలు కూడా కారణం అనే భావనలో విజయసాయి ఉన్నారు. అందుకే తనే సొంతంగా ఛానల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
గతంలో తాను ఛానల్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించినా జగన్ .. అన్న నీకు ఇదంతా ఆర్థిక భారం అవుతుంది మనకు సాక్షి ఉండగా.. మరో ఛానెల్ వద్దు అని చెప్పడంతో ఆగిపోయానని విజయసాయిరెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ఆగిపోయిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక ఛానల్ ఏర్పాటుకు ప్రయత్నించటం వైసీపీలోనే కాక రేపుతోంది. ఏది ఏమైనా సొంత పార్టీలోనే తనను టార్గెట్ చేసిన వారిని విజయసాయి తన మీడియా ద్వారా టార్గెట్ చేసి ఊపిరి ఆడకుండా చేస్తారని చర్చలు వైసిపి వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.