జగన్ను ఫుట్బాల్ ఆడేస్తారా... గేమ్ ఇలా ప్లాన్ చేశారా...!
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు కళ్ల ముందు కనిపిస్తున్న కష్టాలు మామూలుగా ఉండేలా లేవు. రాజకీయ కక్ష సాధింపులు.. వేధింపులకు ఆయన పాలన కేరాఫ్గా నిలిచిందనే భావన ఉన్న విషయం తెలిసిందే. ఇదే అన్ని వర్గాల ప్రజల్లోనూ.. అసహ్యాన్ని పెంచేసింది. ఫలితంగా తాను ఎన్నో ఇచ్చానని.. ఎంతో చేశానని చెప్పుకొన్నా ప్రజలు హర్షించలేక పోయారు. దీంతో చిత్తుగా ఓడించి పక్కన పెట్టారు. ఇక, ఇప్పడు ఆయన చేసిన పాపాలే.. ఇప్పుడు ఆయనకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.
దీనిలో ప్రధానంగా పాలన పరంగా జగన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను చంద్రబాబు కొట్టేస్తోంది. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. అదేసమయంలో ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో మార్పులు చేస్తున్నారు. ఇక, ఆర్థికంగా.. అప్పులు చేయడంలో నెంబర్ 1గా ఉన్న జగన్.. ఆ అప్పుల సొమ్మును ఎటువైపు దారి మళ్లించారు.? ఏం చేశారు? అనే విషయాలపైనా విచారణ చేయనున్నారు. తద్వారా జగన్ అక్రమాలను వెలికి తీయనున్నారు.
ఇదేసమయంలో ప్రతి శాఖపైనా చంద్రబాబు శ్వేత పత్రం తీసుకురానున్నారు. దీని ద్వారా.. జగన్ పాలన ఎలా సాగింది? ఎవరెవరికి ఎలాంటి మేళ్లు చేశారు? తద్వారా ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లింది.. అనే విషయాలను తెరమీదికి తీసుకువచ్చి.. ప్రజా కోర్టులో జగన్ను నిందితుడిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా కూడా.. అసెంబ్లీలోనే చేయనున్నారు. తద్వారా జగన్కు ఉన్న విశ్వసనీయత అనే ట్యాగ్ను పూర్తిగా తెంచేయనున్నారు.
ఇక, ఆయనపై ఇప్పటికే నమోదైన అక్రమ కేసులు, సీబీఐ, ఈడీ విచారణను వేగవంతం చేసేందుకు.. తద్వారా.. వచ్చే ఎన్నికల నాటికి కోలుకోకుండా చేసేందుకు ప్రయత్నాలు చేయొచ్చు. కేంద్రంలోనూ టీడీపీ భాగస్వామ్య ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో జగన్పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో విచారణ పుంజుకుంటే.. ఆయన జైలుకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. మరోవైపు.. సానుకూల దృక్ఫథంతో తమ పార్టీలోకి వస్తారనే వారికి.. చంద్రబాబు రెడ్ కార్పెట్ పరిస్తే.. వైసీపీ పూర్తిగా నిర్వీర్యం కూడా కావొచ్చు. ఏదేమైనా.. వచ్చూ మూడేళ్లలో జగన్కు కష్టాలే స్వాగతం పలకనున్నాయనడంలో సందేహం లేదు.