ఐదేళ్లూ దేవినేని సైలెంట్ కావాల్సిందే.. లేకపోతే ఆ లెక్క వేరే..!
- ఏలూరు రోడ్లో ఇళ్లు, బిజినెస్లపై కూడా టీడీపీ కన్ను
- నోరెత్తితే కేసులు పెట్టేందుకు బెజవాడ నేతలు రెడీ
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
అధికారంలో ఉండగా రెచ్చిపోయిన వైసీపీ నాయకులకు ఇప్పుడు చెక్ పెట్టేందుకు టీడీపీ నాయకులు కూడా రెడీ అవుతున్నారు. ప్రభుత్వ పరంగా.. చంద్రబాబు ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అయితే.. మనసులో పెరిగిపోయిన కసి.. గత వైసీపీ అధికారంలో ఉండగా.. చేసిన దౌర్జన్యాలు వంటివి అంత తేలికగా టీడీపీ నాయకుల నుంచి దూరం కాలేక పోతున్నాయి. దీంతో వారు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు.
ఈ క్రమంలో విజయవాడ కు చెందిన తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్, ఈ ఎన్నికల్లో ఓడిపోయిన దేవినేని అవినాష్ కేంద్రంగా కొందరు నాయకులు చక్రం తిప్పుతున్నారు. అవినాష్.. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలపై పోలీసుల ద్వారా ఒత్తిళ్లు పెంచారనేది వాస్తవం. ముఖ్యంగా విజయవాడలో ఉండే.. కీలక నాయకులు.. పట్టాభి సహా.. మరికొందరిపై ఆయన పోలీసులతో కేసులు పెట్టించారని పార్టీ వర్గాలు అప్పట్లో ఆరోపించాయి.
ఇక, సోషల్ మీడియాలోనూ.. వారి కుటుంబాలపై తీవ్ర విమర్శలు చేయించారు. కనీసం.. నోరు ఎత్తేందు కు కూడా.. భయపడే పరిస్థితి తీసుకువచ్చారు. ఇక, సొంత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుటుంబంపైనా అవినాష్ అనుచరులు దాడి చేశారు. దీంతో గద్దె సతీమని..అనురాధ ఒకానొక సందర్భంలో కన్నీరు పెట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఈ పరిణామాలన్నీ..ఇప్పుడు పార్టీ నాయకులు తోడుతున్నారు. అవినాష్ ఏమాత్రం నోరెత్తినా.. ఆయనపై కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
అంతేకాదు.. ఏలూరు రోడ్డులోని అవినాష్ ఇల్లు.. ఇతర వ్యాపార సముదాయాల ప్లానింగ్, కట్టడాల తీరు వంటివాటిని కూడా.. టీడీపీ నాయకులు పరిశీలిస్తున్నారు. వీటిలో చేపట్టిన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. కూల్చి వేయించాలని కూడా.. భావిస్తున్నారు. మనసులో బాధ ఉన్నా.. అన్నీ నిబంధనల మేరకే చేయాలని వారు నిర్ణయించుకున్నారు. సో.. ఈ నేపథ్యంలో అవినాష్ పరిస్థితి గత ఐదేళ్లు ఉన్నట్టుగా అయితే ఉండే పరిస్థితి ఉండదని అంటున్నారుపరిశీలకులు.