విశాఖ: అతి తక్కువ పోలింగ్‌.. కారణాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Purushottham Vinay
విశాఖ పార్లమెంట్‌ పరిధిలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదవ్వడం హాట్ టాపిక్ అవుతుంది. అయితే 2019తో పోలిస్తే మాత్రం ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరిగింది.కానీ 5 సంవత్సరాలకు వచ్చే అవకాశాన్ని 5 లక్షలకు పైగా ఓటర్లు పోగొట్టుకున్నారు. సమర్థులైన నాయకులను ఎన్నుకునేందుకు ఓటు అనే వజ్రాయుధాన్ని ఓటర్లు ఏమాత్రం వినియోగించుకోలేదు. విశాఖ పార్లమెంటు పరిధిలో మొత్తం 19,27,303 మంది ఓటర్లుండగా వారిలో కేవలం 13,70,484 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. అంటే ఏకంగా 5,56,819 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చర్రితలోనే రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే..అత్యల్పంగా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మాత్రం కేవలం 71.11 శాతం మాత్రమే ఓటేశారు. 2019 వ సంవత్సరపు ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు 80 శాతం పోలింగ్‌ నమోదైతే.. ఇక్కడ కేవలం 67.26 శాతానికే (రాష్ట్రంలో అత్యల్పం) పరిమితమైంది. 2014 వ సంవత్సరపు ఎన్నికల్లో కూడా పోలింగ్‌ శాతం కేవలం 67.53గా ఉండటం గమనార్హం.వృత్తి, వ్యాపార, విద్యావసరాల దృష్ట్యా పొరుగు రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఉంటున్న విశాఖ ఓటర్లు ఎక్కువ మంది పోలింగ్‌లో పాల్గొన్నా కానీ స్థానికంగా ఉన్న విద్యావేత్తల్లో అయితే అధిక శాతం పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.


ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓటేయడానికి ఓటర్లు కనీసం మూడు నుంచి నాలుగు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈవీఎంలు మొరాయించడం ఇంకా పోలింగ్‌ నెమ్మదిగా సాగడంతో చాలా మంది రెండు, మూడు సార్లు కేంద్రాలకు వచ్చి తిరిగి వెళ్లిపోయారు. కేంద్రాల వద్ద సరైన సదుపాయాలు లేకపోవడం కూడా ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టింది.అపార్టుమెంటుల్లో ఉండేవారు చాలా మంది కూడా ఓటేయడానికి ఆసక్తి చూపలేదు. పోలింగ్‌ రోజుతో పాటు ముందు రెండో శనివారం, ఆదివారం సెలవుల వల్ల పొరుగు ప్రాంతాలకు విహారానికి వెళ్లిపోయారు. పైగా సచివాలయ ఉద్యోగులు చాలా మందికి ఓటరు స్లిప్పులు అందజేయలేదు. ఆన్‌లైన్‌లో తీసుకునే అవకాశమున్నా కానీ వాటిపై సరైన అవగాహన లేక ఎక్కువ మంది ఇళ్ల వద్దనే ఉన్నారు. ఒకే కుటుంబంలోని ఓట్లు వేర్వేరు కేంద్రాల పరిధిలో ఉండటం వల్ల కొందరు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.పైగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన చాలా మంది ఉద్యోగులు, వలస కూలీలు విశాఖ తూర్పు, భీమిలి నియోజకవర్గాల్లో ఉంటున్నారు. వారిలో చాలా మందికి రెండు ప్రాంతాల్లో కూడా ఓట్లున్నాయి.అందువల్ల వారంతా ఓటే వేసేందుకు వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: