విశాఖ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో చాలా కీలకమైన నియోజకవర్గం నర్సీపట్నం.ఈ నియోజకవర్గం టిడిపికి కంచుకోటగా ఉంది. అలాంటి కంచుకోట ను 2019లో వైసీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మాత్రం ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. టిడిపి నుంచి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పోటీ చేస్తూ ఉంటే వైసీపీ నుంచి పెట్ల ఉమా శంకర్ గణేష్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి కీలక నేతల మధ్య జరుగుతున్నటువంటి హోరాహోరీ పోరులో టిడిపిదే కాస్త పై చేయి ఉన్నట్టు తెలుస్తోంది. మరి దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గత 40 ఏళ్ల నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎప్పుడైనా సరే ఒక దఫా ఓడిపోతే మరో దఫా ఖచ్చితంగా గెలుస్తూ ఉంటారు. 2014లో అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. మళ్లీ 2019లో ఉమా శంకర్ గణేష్ గెలుపొందారు. అయితే ఉమా శంకర్ గణేష్ ఆ నియోజకవర్గాన్ని ఎక్కువగా అభివృద్ధి ఏమీ చేయలేదనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన అవినీతిలో కూడా ముందున్నారట. ముఖ్యంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూకబ్జాలు , సాండ్ ఇలా ఎన్నో ఆరోపణలతో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకానికి తోడుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ప్రజలను ఆందోళనలో పడేస్తోంది. ఇన్ని ఆరోపణల మధ్య ఉమా శంకర్ గెలవడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఆయనపై ఉన్న వ్యతిరేకతను అయ్యన్నపాత్రుడు క్యాష్ చేసుకున్నారు. తాను ఓడిపోయినప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ ప్రజల మనిషిగా తిరుగుతూ వచ్చారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వారి వెంట తప్పనిసరిగా ఉంటారు. ఏదైనా కేసులు లాంటివి ఉంటే పోలీస్ స్టేషన్లోకి కూడా వెళ్లి మాట్లాడుతారట. ఈ విధంగా నర్సీపట్నంలో ఒక సామాన్య వ్యక్తిగా తిరిగే అయ్యన్నపాత్రుడికి ఈసారి గెలుపు ఖాయమని అంటున్నారు. దీనికి తోడు ఈసారి జనసేన,బీజేపీ పార్టీలు కూడా కలిసాయి కాబట్టి అయ్యన్నపాత్రుడికి అక్కడ మెజారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.