మోదీ మంత్రాలు ఘోరంగా విఫలం.. అందుకే తొలివిడతలో అలా?
గత 2019 ఎన్నికల తొలి దశలో 70శాతం పోలింగ్ నమోదైతే.. ఇప్పుడు జరిగిన తొలిదశలో 60శాతమే ఓటింగ్ నమోదైంది. దీంతో ప్రజాస్వామ్య వాదులు.. ఎన్నికల సంఘం అధికారులు కూడా నివ్వెరపోయారు. ఊరూవాడా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినా ఫలితం దక్కకపోవడంపై తలలు పట్టుకుంటున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ శుక్రవారం జరిగింది. 21 రాష్ట్రాలు, అండమాన్, లక్ష ద్వీప్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది.
ఇక తమిళనాడులో మొత్తం 39 లోక్ సభ ఒకేసారి పోలింగ్ జరిగింది. అయితే ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఐదు గంటల వరకే జరగాల్సి ఉండగా.. అన్నీ చోట్లా పోలింగ్ సమయాన్ని రెండు గంటల పాటు పెంచారు. అయినా పోలింగ్ శాతం పెరగకపోగా..గత ఎన్నికలతో పోలిస్తే.. 10శాతం ఘోరంగా తగ్గింది.
ఇక నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రంలో అయితే జీరో శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ కేవలం పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి కుటుంబాల వారే ఓటేశారు. వారి పార్టీల నేతలు మాత్రమే వేశారు. చిత్రం ఏమిటంటే.. ఆయా ప్రాంతాల్లో ప్రధాని మోదీ.. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ప్రచారం హోరెత్తించినా ఉపయోగం లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం ఆయా పార్టీలపై ఎవరికీ నమ్మకం లేకపోవడం.. మోదీ మేనియా కూడా లేదని అర్థం అవుతుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా తమ జీవితాల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదన్న భావనే కారణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.