'సమరం' లో సామాన్యుడు: వైసీపీ తిరుపతి రావును జగన్ అసెంబ్లీలో కూర్చోపెడతాడా ?
- పార్టీ మారి టీడీపీ నుంచి బరిలో ఎమ్మెల్యే వసంత
- డబ్బున్నోడితో సామాన్యుడి ఆసక్తికర పోరు
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో ఉమ్మడి కృష్నాజిల్లాలోని మైలవరం ఒకటి. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా.. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బరిలో ఉన్నారు. ఇక, వైసీపీ నుంచి సామాన్య నాయకుడు సన్యాల తిరుపతి రావు యాదవ్ బరిలో నిలిచారు. ఇక్కడ రెండు విషయాలు కీలకంగా మారాయి. ఒకటి సామాజిక వర్గం పరంగా.. వైసీపీ ప్రయోగం చేసింది. నియోజకవర్గంలో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే తొలిసారి.
కమ్మ సామాజిక వర్గానికి కోటరీగా భావించే మైలవరంలో బీసీ వర్గానికి చెందిన తిరుపతిరావుకు వైసీపీ టికె ట్ ఇచ్చింది. ఇక, టీడీపీ మాత్రం కమ్మ వర్గానికి చెందిన వసంతకే అవకాశం ఇచ్చింది. దీంతో పోరు ఆసక్తి గా మారింది. బీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ మైలవరంలో మాత్రం.. కమ్మ వర్గమే ఆధిపత్యం ప్రదర్శిస్తోం ది. కానీ, ఇప్పుడు ఇక్కడ మార్పు కోరుతూ.. వైసీపీ ప్రయోగం చేయడం గమనార్హం. మరి ఈ ప్రయోగాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలి.
మరోవైపు.. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచిబరిలోకి దిగిన తిరుపతిరావు.. ఆస్తులు కేవలం లక్షల్లోనే ఉండడం గమనార్హం. సాధారణ రాజకీయ నేతగా ప్రస్తానం ప్రారంభించిన తిరుపతిరావుకు ఎమ్మెల్యే టికెట్ రావడం అసలు ఊహించని ఘటన. అదే ఆయన కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను కలలో కూడా ఊహించలేదని.. అసలు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసే స్థాయి కూడా లేదని చెప్పారు.కానీ, సీఎం జగన్ పట్టుబట్టి ఇక్కడ ఆయనను పోటీకి దింపారు.
దీంతో ఎన్నికల ఖర్చు పరంగా సన్యాల పెద్దగా దూకుడు చూపించే అవకాశం లేదు. మరోవైపు.. టీడీపీ నుంచి బరిలో ఉన్న వసంత కృష్ణప్రసాద్ కుటుంబం ఆర్థికంగా.. రాజకీయంగా కూడా బలంగా ఉన్న విషయం తెలిసిందే. వసంత నాగేశ్వరరావు కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అదేవిధంగా వ్యాపారాలు.. ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంత బలమైన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి తిరుపతిరావును ప్రజలు ఏమేరకు ఆశీర్వదిస్తారో చూడాలి.