పనిలో మొనగాడు ఈ ' చింతమనేనోడు ' ... తిరుగులేని మాసోడు..!
- మాస్కు మొనగాడు.. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో తిరుగులేని క్రేజున్నోడు
- రు. 2 వేల కోట్ల దెందులూరు అభివృద్ధి... కళ్లకు కట్టిన నిజం
( గోదావరి - ఇండియా హెరాల్డ్ ప్రత్యేక ప్రతినిధి )
మాట కటువు.. కానీ, మనసు మాత్రం వెన్న. ఆ నోటికి హద్దులేదన్న ఒక్క విమర్శను పక్కన పెడితే.. ఆ చేతికి ఎముక కూడా లేదు. ఆయనే దెందులూరు నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తాజా ఎన్నికల్లో దెందులూరు నుంచి వరుసగా నాలుగోసారి టీడీపీ తరపున పోటీకి రెడీ అవుతోన్న చింతమనేనికి ఈ ఎన్నికల్లో గెలుపు కీలకం కానుంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఎంతో ప్రతిష్టాత్మకం. చింతమనేనికి ఎక్కడైనా మైనస్ ఉందంటే అది ఆయన నోటి మాటే... ఇక కొందరు పెత్తందారులే ఆయన్ను ఒప్పుకోరు అంతే..! పేదల్లోపేదగా, ఎస్సీలకు ఎస్సీగా, బీసీలకు బీసీగా పేరు తెచ్చుకున్న చింతమనేని.. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. పక్కా ఊరమాస్ను తలపించే ఆయన ఆహార్యం.. ఆయన మాట తీరు వంటివి.. నిజంగానే మాస్ జనాలతో ఇట్టే కనెక్ట్ అయిపోతుంది. ఆయన మాస్ స్టైలే ఆయన్ను రాష్ట్ర వ్యాప్తంగా మాస్లో తిరుగులేని హీరోగా నిలబెట్టింది.
సేవల్లో మేటి... దానంలో మేటి..
ఎన్టీఆర్ జనతా క్యాంటీన్ పేరుతో తన ఇంట్లోనే గత పదేళ్లకుపైగా నిత్యంఆయన చేస్తున్న అన్నదానం.. రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డని చెప్పాలి. అక్కడ తిరుమలలో శ్రీవారి అన్నదానానికి ఎంత పేరుందో ఇక్కడ చింతమనేని చేసే అన్నదానికి దాదాపు అంతే పేరుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యక్రమాలు ఏవి జరిగినా మద్రాస్ - కలకత్తా జాతీయరహదారికి అనుకున్న ఉన్న ఆయన ఇంటి దగ్గరే వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేయడం కామన్. ఎవరికి కష్టమొచ్చినా.. నేనున్నానంటూ.. ముందుండే నాయకుడు చింతమనేని. చాలా మంది నాయకులు.. తమ ఇళ్ల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెబుతారు. కానీ, చింతమనేని చెప్పరు.. ఎందుకంటే.. ఆయన ఇంటికి తలుపులే లేవనేంతగా వస్తారు జనాలు.
రు. 2 వేల కోట్లతో దెందులూరులో తిరుగులేని అభివృద్ధి :
ఇక, సమస్యలు పరిష్కరించడంలోనూ చింతమనేనికి తిరుగులేదు. నియోజకవర్గంపై పూర్తి ఆధిపత్యం ఉన్న నాయకుడనే చెప్పాలి. నియోజకవర్గంలోమండలాలు, గ్రామాలు, వార్డులు.. అక్కడి సమస్యలు.. ఇలా అన్ని విషయాలు ఆయన నోటిమీదే తారట్లాడుతుంటాయి. అనేక సమస్యల పరిష్కారం ఎంతో కృషి చేశారు. దెందులూరు నియోజకవర్గాన్ని 2014- 19 మధ్యలో మరో 20 - 30 ఏళ్లు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అభివృద్ధి చేశారనడంలో సందేహం లేదు. 2009 - 14 తొలి టర్మ్లో ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి కంటే 2014 - 19 ఐదేళ్లలో ఏకంగా 2 వేల కోట్లకు పైగా నిధులతో దెందులూరు అభివృద్ధి జరిగింది. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. వైసీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటకీ చింతమనేని చేసిన అభివృద్ధే దెందులూరులో కళ్లకు కనిపిస్తోన్న నిజం.
ఇక ఎంతో మంది పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్య సేవలు త్వరితగతిన అందేలా చేసి వారి ప్రాణాలు కాపాడడం ప్రభాకర్కే చెల్లింది. కొన్ని వందల మంది గర్భిణీలకు ఆయన చెప్పి చేయించిన వైద్యసేవలే ఇందుకు నిదర్శనం. ఇక ప్రభాకర్ రైతు బిడ్డ కావడంతో దెందులూరు నియోజకవర్గంలో నీళ్లు, పుంతరోడ్లు, ఇతర అంతర్గత రహదారుల కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే.. మాట తీరు విషయంలో మాత్రం తనను తాను కంట్రోల్ చేసుకోకపోవడంతోనే ఇబ్బందులు ఎదురయ్యాయి.. తప్ప.. పనిలో మాత్రం చింతమనేనికి తిరుగులేదనే వాదన ఉంది. ఆ చిన్న మైనస్ వస్తే ప్రభాకర్కు రాజకీయంగా ఎప్పటకీ తిరుగు ఉండేదే కాదు.
గతం ఎలా ఉన్నా ఐదేళ్లలో నియోజకవర్గంలో జీరో అభివృద్ధి ఉంది. అందుకే నియోజకవర్గంలో ఇప్పుడు కూడా ఆయన పేరు మార్మోగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన గెలుపు ఇప్పటికే ఖాయమైందని ఆయన వర్గం చెబుతోంది. అంతేకాదు.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేవలం మెజారిటీ కోసమేనని కూడా అంటున్నారు. ప్రతి ఒక్కరి మదిలో చింతమనేని ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఏ సమస్య వచ్చినా నేనున్నాననే ఆయ మాట వినిపిస్తూనే ఉంటుంది. ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా.. చింతమనేనే గుర్తుకు వస్తారు. మొత్తంగా.. దెందులూరు.. స్వాప్నికుడిగా.. చింతమనేనిది చిరస్థాయి ముద్ర అనే చెప్పాలి.