జగన్ క్యాస్ట్ ఈక్వేషన్కు ఓట్లు రాలతాయా... మైలవరంలో ' టీడీపీ కేపీ ' మెజార్టీ లెక్క ఇదే...!
- టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వసంతకు కలిసొస్తోన్న అన్ని ఈక్వేషన్లు
- మైలవరంలో మిస్ అయిన సమ ఉజ్జీల సమరం
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో హై వోల్టేజ్ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఒకటి ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం. దేవినేని ఉమ, జోగి రమేష్ మధ్య 2014లో జరిగిన పోరాటం నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగింది. కేవలం 7 వేల ఓట్ల తేడాతో ఉమా గెలిచారు. ఆ తర్వాత 2019లో దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్ మధ్య ఫైట్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ గత ఎన్నికల్లోనూ ఇద్దరూ ఉద్దండులే పోటీ చేశారు. ఇలా ప్రతిసారి ఇక్కడ పోరు సమ ఉజ్జీల మధ్య సాగుతూ రక్తి కడుతోంది. అయితే ఈ సారి సమ ఉజ్జీల పోరు లేకుండా పోయింది.
వైసీపీ నుంచి ఓ సాధారణ జడ్పీటీసీ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన అపర కుబేరుడు వసంత కృష్ణప్రసాద్ ఈ సారి పార్టీ మారి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఇక జగన్ ఒక సామాజిక వర్గానికి అందరూ వ్యతిరేకం అవుతారనే జడ్పీటీసీ సర్నాల తిరుపతిరావుకు సీటు ఇచ్చారు. మైలవరం విజయవాడ పార్లమెంటు పరిధిలో అత్యంత కీలకమై స్థానం. టీడీపీకి ఇది కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత వరుసగా పార్టీ నేతలు ఎన్.సత్యనారాయణ, జ్యేష్ట రమేశ్బాబు, వడ్డే శుభనాద్రిశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా కూడా పనిచేశారు.
ఇక్కడ వసంత టీడీపీలోకి వెళ్లిపోవడంతో పోటీ చేయాలని మంత్రి జోగి రమేష్ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన పెడన ఎమ్మెల్యేగా ఉన్నా ఇది సొంత నియోజకవర్గం కావడంతో గత మూడేళ్లుగా తన అనుచరులను పెంచి పోషించుకుంటూ వచ్చారు. అక్కడే వసంతతో గ్యాప్ వచ్చి ఆయన పార్టీ మారే వరకు వెళ్లింది. అయితే జగన్ జోగిని పెడన నుంచి పెనమలూరుకు మార్చేశారు. ఇది జోగికి కూడా ఇష్టం లేదు.
ఇక టీడీపీ వసంత కృష్ణ ప్రసాద్ విషయానికి వస్తే వ్యక్తిగతంగా సౌమ్యుడు.. వివాదాలకు దూరంగా పాతతరం పెద్దలా రాజకీయాలు చేస్తారన్న పేరుంది. ఆర్థికంగా ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు. టీడీపీ కేడర్ను కలుపుకుపోతూ వస్తున్నారు. అటు టీడీపీలో ఉమా, బొమ్మసాని సుబ్బారావు వర్గాలు కూడా కేపీకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇటు వైసీపీలోని తన అభిమానుల ఓట్లపై కూడా గురి పెట్టారు. మైలవరంలో భారీ మెజార్టీతో గెలుస్తాను అన్న ధీమా వసంతకు ఉంది.
ఆర్థికంగా బలమైన వసంతను తిరుపతిరావు తట్టుకునే పరిస్థితి లేదు. బీసీ కోటాలో తిరుపతిరావుకు జగన్ సీటు ఇచ్చినా ఆయనపై పరిశీలకులుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారిని నియమించారు. వారి ద్వారానే డబ్బులు ఖర్చు చేయిస్తున్నారు. అధిష్టానం పంపిన డబ్బును నొక్కేస్తున్నారనే ఒక నేతను తీసేసి మరో రెడ్డి నేతను నియమించారు. ఇది మైలవరంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎవరో గెలుస్తారో ? అంచనా వేయడం పెద్ద కష్టం కాదు.