కేసీఆర్ మాటలు నిజమైతే.. రేవంత్‌ రెడ్డికి షాక్‌ తప్పదు కదా?

Chakravarthi Kalyan
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుదీర్ఘ విరామం నాలుగు నెలల తర్వాత ఇటీవల ప్రజల్లోకి వచ్చారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీని బతికించే పనిని భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నల్గొండ, జనగాం, సూర్యాపేట జిల్లాల్లోని పలు మండలాల్లో పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రైతలను పరామర్శించి.. వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

ఈ క్రమంలో గులాబీ బాస్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇలా అయిపోతుందని ఎన్నడూ ఊహించలేదన్నారు. రైతుల బాధలు సావధానంగా విన్న అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో అన్నదాతలు మళ్లీ ఆత్మహత్యలు  చేసుకును దుస్థితి వస్తుందని అనుకోలేదని.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అంతా ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. సూర్యాపేటలో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.

దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్ప కాలంలో ఈ దుస్థితి ఎందుకు రావాలి. సాగు నీళ్లు ఇస్తారని నమ్మి రైతులు పంటలు వేసుకున్నారు. ముందే చెబితే వేసుకునే వాళ్లం కాదని రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇంత కష్టకాలం  వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతలకు లేని కష్టాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.

ఐదారేళ్లపాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు ఇచ్చాం. ఇప్పుడు మిషన్ భగీరథ నిర్వహణలో లోపాలు ఎందుకు వస్తున్నాయి. రైతుల మోటార్లు కాలిపోతున్నాయి. గత పదేళ్లుగా రాష్ట్రంలో మాయమైన ఇన్వర్టర్లు, క్రేన్లు, బోర్లు ఇప్పుడు ప్రత్యక్షం అవుతున్నాయి. మా హయాంలో హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చాం. ప్రస్తుత అసమర్థ ప్రభుత్వ విధానాల వల్లే కరెంట్ కోతలు. దీనికి నూటికి నూరు శాతం ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ మాట్లాడారు. మరి ఈ మాటలన్నీ నిజమే అయితే రేవంత్‌ రెడ్డికి ఎన్నికల్లో షాక్‌ తప్పదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: