ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో తాజాగా పెద్ద కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి , జనసేన , బిజెపి పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సందర్భంగా కొన్ని ప్రాంతాలలో టిడిపి కాకుండా జనసేన , బిజెపి అభ్యర్థులు నిలబడబోతున్నారు. దానితో టిడిపి అభ్యర్థులకు స్థానం లేకుండా పోతుంది.
ఇక టిడిపి ... జనసేన , బిజెపితో పొత్తు పెట్టుకున్న సమయంలోనే చంద్రబాబు నాయుడు ... తెలుగుదేశం పార్టీ అధిష్టానం మనం ఆశించిన కొన్ని చోట్లను మన పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు ఇవ్వవలసి ఉంటుంది. వాటి విషయంలో మీరు ఏ మాత్రం బాధపడకండి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ప్రధమ స్థానం దక్కుతుంది అని చంద్రబాబు వారికి తెలియజేశాడు. ఇక చంద్రబాబు పిలుపుతో పొత్తులో భాగంగా సీటు దక్కని వారు కూడా సైలెంట్ గా తమ పని చేసుకుంటూ వెళుతున్నారు.
ఇకపోతే పొత్తులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం స్థానాన్ని మొదటి నుండి బిజెపి కోరుతుంది. దానితో టీడీపీ అధిష్టానం కూడా ఈ స్థానాన్ని బిజెపికి కేటాయించింది. ఇక ఈ రోజో రేపో.. బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంది. దీనిలో ఆదోని నుంచి కూడా అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఇంతలోనే సంచలన ఫోన్ సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది.
దీనిలో ఆదోని టికెట్ రేసులో ఉన్న బీజేపీ నాయకుడు ఒకరు.. టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆదోని తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు తో ఫోన్లో సంభాషించారు. ఈ సంభాషణలో ... ఆదోని టికెట్ ను నీకే (టీడీపీ నేతకే) వదిలేస్తాం. నువ్వే పోటీ చేసుకో. కానీ ... నాకు రూ.3 కోట్లు ఇవ్వు అని బీజేపీ నుంచి టికెట్ ఆశించిన నాయకుడు బేరానికి దిగారు.
బీజేపీ నాయకుడు కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు నాగరాజు ... టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఈ ఫోన్ సంభాషణ జరిగింది. ఇకపోతే ఈ పూర్తి సంభాషణను విశ్లేషించిన కొంత మంది విశ్లేషకులు ఇది బిజెపి పై తెలుగు దేశం పార్టీ వ్యక్తులు చేస్తున్న కుట్రగా పరిగణిస్తున్నారు. ఇక దీనిపై టిడిపి ... బిజెపి పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.