అంతర్జాతీయ వేదికపై చైనాకి బుద్ధి చెప్పిన జైశంకర్?

Chakravarthi Kalyan
లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ దేశ పరిణామాలు చకచకా మారుతున్నాయి. చైనా బోర్డర్ లో భారత ఆర్మీ అలర్ట్ అయింది.  ఒక్కసారిగా సైనిక మోహరింపును పెంచేసింది. ఈ విషయమై  భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అంతర్జాతీయ వేదికపై మరోసారి చైనా తీరును తూర్పారపట్టారు. పొరుగుదేశం రాతపూర్వక ఒప్పందాలను పాటించకపోవడం ఆందోళనకర విషయమన్నారు. సరిహద్దుల్లో 2020లో చోటు చేసుకున్న రక్తపాతానికి చైనానే కారణమన్నారు.

టోక్యోలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన రైసినా రౌంట్ టేబుల్ ప్రారంభ సమావేశాల్లో మాట్లాడిన ఆయన చైనా తీరుపై నిప్పులు చెరిగారు. ఇండో పసిఫిక్ ప్రాభల్యంలో మార్పు అనేది వాస్తవం.  సామర్థ్యాలు, ప్రభావం ఆశయాల్లో భారీ స్థాయిలో మార్పులు జరుగుతున్నప్పుడు వ్యూహాత్మక పరిణామాల్లోను మార్పులు ఉంటాయి. అది నచ్చినా.. నచ్చకపోయినా వాస్తవికతను ఎదుర్కోవాలి. కానీ దురదృష్టవాత్తు చైనా విషయంలో అలా జరగడం లేదు. 1975-2020 కాలాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. దాదాపు 45 ఏళ్లలో సరిహద్దుల్లో రక్తపాతం జరగలేదు. కానీ 2020లో పరిస్థితులు మారిపోయాయి అని జైశంకర్ పేర్కొన్నారు.

1993లో బీపీటీఏ, 1996 వాస్తవాధీనారేఖకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలను ప్రస్తావించిన ఆయన పొరుగుదేశంతో చేసుకున్న ఒప్పందాలను చైనా పాటించకపోవడం అనేది ఆందోళనకర అంశమని అన్నారు. ఇది రెండు దేశాల సంబంధాల్లో స్థిరత్వం, ఉద్దేశాలపై ప్రశ్నను లేవనెత్తుతుందన్నారు. ఐరాపాలో ఘర్షణ, ఆసియాలో అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోక పోవడం, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిణామాలను చూస్తునే ఉన్నమన్నారు. అందుకే మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా సమతుల్యత పాటిస్తూ ఇతర దేశాలతో భారత్ సంబంధాలు కొనసాగిస్తోందని చెప్పారు.

సరిహద్దుల్లో ఎక్కడా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చైనాకు సరైన బుద్ధి చెబుతాం అంటూ జైశంకర్ హెచ్చరించారు. ఇప్పుడు భారత్, చైనాలు చాలా విషయాలపై వైరుధ్యాలతో రగిలిపోతున్నాయి.  ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదుగుతోంది. ఇండియా మారుతోంది. మన శక్తి సామర్థ్యాలు పెరుగుతున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: