గోదావరి : జనసేనను నిండా ముంచేసిన చంద్రబాబు

Vijaya

తెలుగుదేశంపార్టీ, జనసేన పోటీచేయబోయే అసెంబ్లీ నియోజకవర్గాల మొదటిజాబితా కలకలం రేపుతున్నాయి. రెండుపార్టీల్లోని నేతలు రెండురకాలుగా మండిపోతున్నారు. టీడీపీ నేతలేమో తాము బలంగా ఉండి గెలుస్తామని అనుకుంటున్న సీట్లలో పోటీకి అవకాశం రాలేదనే కోపాన్ని చంద్రబాబునాయుడు మీద చూపుతున్నారు. దాదాపు 25 నియోజకవర్గాల్లోని నేతలు రెచ్చిపోయి పార్టీ ఆఫీసుల్లో ధ్వంసం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆశించిన సీట్లకు వాస్తవానికి మధ్య అసలు పొంతన లేదన్న మంటతో జనసేన నేతలు, కాపుల్లో కనబడుతోంది.



జనసేన నేతలు, కాపు ప్రముఖులు 50-60 సీట్ల మధ్య జనసేన పోటీచేయాలని, చేస్తుందని బాగా ఆశతో ఉన్నారు. అయితే జనసేనకు చంద్రబాబు ఇచ్చింది కేవలం 24 అంటే 24 సీట్లు మాత్రమే. ఇక్కడే కాపులు, పార్టీ నేతలు పవన్ పైన మండిపోతున్నారు. ఇన్ని తక్కువ సీట్లు తీసుకుని పోటీచేస్తే కాపులు, జనసేన ఓట్లు టీడీపీకి బదిలీకావని పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు ఇదే ఫైనల్ అయితే మళ్ళీ జగన్మోమన్ రెడ్డే సీఎం అవుతారని జనసేన నేతలు చెబుతున్నారు.



ఇపుడు విషయం ఏమిటంటే జనసేనను చంద్రబాబు గోదావరి జిల్లాల్లో నిలువునా ముంచేశారంటు కాపులు మండిపోతున్నారు. ఎలాగంటే మొదటిజాబితాలో ప్రకటించిన నియోజకవర్గాల్లో టీడీపీ 94 అయితే జనసేన 5 మాత్రమే. ఇందులో ఉభయగోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో మొదటిజాబితాలో 15 సీట్లను మాత్రమే ప్రకటించారు. ఇందులో టీడీపీ 13 సీట్లలోను, జనసేన 2 సీట్లలో పోటీచేయబోతోంది.



ఇక మిగిలిన 19 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీచేస్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇదే దామాషాలో సీట్లను పంచుకుంటే టీడీపీ 16 నియోజకవర్గాల్లోను, జనసేన మూడుచోట్ల మాత్రమే పోటీచేస్తుంది. సీట్ల ప్రకటనకు ముందు జనసేన రెండుజిల్లాల్లో కలిపి 12 సీట్లలో పోటీచేస్తుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాంటిది ఐదు సీట్లకు మాత్రమే పరిమితమవ్వటం అంటే జనసేనను చంద్రబాబు నిలువునా ముంచేసినట్లే అని కాపులు, జనసేన నేతలు మండిపోతున్నారు. మరి రెండోవిడత జాబితాలో ఎన్నిసీట్లు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: