టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టిన అయ్యన్న?
ఏపీలో ఎత్తుల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ, జనసేన మధ్య ఖాయమైన ఇప్పటికే సీట్ల సర్దుబాటు పంచాయితీ తేలలేదు. ఇప్పుడే సీట్ల గురించి రెండు పార్టీల మధ్య పోటీ మొదలైంది. టీడీపీ అధినేత మండపేట, అరకు సీట్లకు తమ అభ్యర్థులను ప్రకటించారు. దీనిని తప్పు పట్టిన పవన్ కల్యాణ్ ఇలా జరిగినందుకు తమ పార్టీ శ్రేణులకు క్షమాపణలు చెప్పారు.
టీడీపీ చేసిన ప్రకటనకు టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా తాను రెండు సీట్లు ప్రకటిస్తున్నానంటూ రాజోలు, రాజానగరం సీట్లను ఖరారు చేశారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఇదే తరహాలో పిఠాపురంలోను టీడీపీ, జనసేన నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు. స్థానిక సామాజిక సమీకరణాల దృష్ట్యా జనసేన ఇక్కడి సీటుపై ఆశలు పెట్టుకుంది.
ఇక్కడి నుంచే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ సమయంలో వర్మ నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. వీటికి జనసేన నేతలను ఆహ్వానించడం లేదు. ఇదు సమయంలో వర్మకు మద్దతుగా సభకు హాజరైన అయ్యన్న పాత్రుడు పిలవగానే అందుబాటులో ఉండే వర్మ లాంటి నేతలు అవసరం అని వ్యాఖ్యానించారు. స్థానిక నేతలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సీట్ల విషయమై ఇరు పార్టీల్లో విభేదాలు భగ్గుమంటున్న వేళ తాజాగా అయ్యన్నపాత్రుడి ప్రకటన ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.