అమరావతి : డాక్టర్ల రిపోర్టే చంద్రబాబును ఆదుకున్నదా ?
మొత్తానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు అనుకున్నది సాధించారు. మెడికల్ బెయిల్ మీద బయటున్న చంద్రబాబుకు హైకోర్టు పూర్తిస్ధాయి బెయిల్ మంజూరుచేసింది. అయితే పూర్తిస్ధాయి బెయిల్ విషయంలో కేసు మెరిట్స్, డీ మెరిట్స్ జోలికి కోర్టు వెళ్ళలేదు. కేవలం అనారోగ్య కారణాలను చూపి తెచ్చుకున్న మధ్యంతర బెయిల్ మీదే హైకోర్టులో సోమవారం తీర్పుచెప్పింది. జడ్జి టి మల్లికార్జునరావు మాట్లాడుతు అనారోగ్య కారణంగా ఇచ్చిన మధ్యతర మెడికల్ బెయిల్ ను పూర్తిస్ధాయి బెయిల్ మంజూరుచేసినట్లు మాత్రమే చెప్పారు.
మధ్యతర బెయిల్ ఇచ్చేటపుడు ఈనెల 28వ తేదీన రాజమండ్రి జైలులో లొంగిపోవాలని ఇచ్చిన ఆదేశాలను తాజాగా హైకోర్టు ఉపసంహరించింది. అయితే 30వ తేదీన స్కిల్ స్కామ్ లో ఏసీబీ కోర్టు జరుపుతున్న విచారణకు మాత్రం హాజరవ్వాల్సిందే అని ఆదేశించింది. సరే ఈ ఆదేశాలు, షరతులను చంద్రబాబు పెద్దగా పట్టించుకోరు. నిజానికి చంద్రబాబు మీద కేసులు పెట్టడం, అరెస్టుచేయటం, 53 రోజులు రిమాండులో ఉంచటమే చాలా ఎక్కువని చెప్పాలి. తనపైన ఒక్క కేసు నమోదైనా చంద్రబాబు ఒప్పుకోరు.
తనపైన కేసు నమోదుచేసే అధికారం సదరు దర్యాప్తు సంస్ధకు లేదని, విచారించే స్ధాయిలేదని వెంటనే కోర్టుకెళ్ళి కేసును కొట్టించేసుకుంటారు. ఏ కారణం వల్లయినా కేసును కొట్టించేసుకోవటం సాధ్యంకాకపోతే విచారణ జరపకుండా బెయిల్ తెచ్చుకుంటారు. దశాబ్దాలుగా కొన్ని కేసులు చంద్రబాబుపై విచారణ జరగకుండానే కోర్టుల్లో మూలపడిన విషయం తెలిసిందే. ఇపుడు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చినా దానిస్ధానంలో తాజాగా పూర్తిస్ధాయి బెయిల్ వచ్చినా అందుకు డాక్టర్ల రిపోర్టే కీలకం.
స్కిల్ స్కామ్ కేసులో మెరిట్స్ లేదా డీ మెరిట్స్ ప్రకారం చంద్రబాబుకు పూర్తిస్ధాయి బెయిల్ దొరకలేదు. కేవలం అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, కంటి, గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇంకా చాలా అనారోగ్యాలు ఉన్నాయని డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును జడ్జి నమ్మారు. చంద్రబాబు అనారోగ్యాన్ని ప్రభుత్వ డాక్టర్లతో మరోసారి చెక్ చేయించాలని అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి ఎంత వాదించినా కోర్టు పట్టించుకోలేదు. మొత్తానికి డాక్టర్ల రిపోర్టు మాత్రమే చంద్రబాబును ఆదుకున్నట్లు అర్ధమవుతోంది.