ఔరా ఏమి ఔదార్యం: జై బాలయ్యా అనాల్సిందే... !
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన 'అఖండ 2' (అఖండ తాండవం) బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి బాలయ్యపై పడింది. ఈ సినిమా ఫలితం కారణంగా నష్టపోయిన బయ్యర్లను ఆదుకోవడంలో బాలయ్య ఎంతవరకు చొరవ చూపుతారనే అంశంపై ఫిల్మ్ నగర్లో చర్చ జోరుగా సాగుతోంది. 'అఖండ' మొదటి భాగం సృష్టించిన ప్రభంజనంతో, సీక్వెల్పై భారీ బిజినెస్ జరిగింది. అయితే, సినిమా ఆశించిన మేజిక్ చేయలేకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో బయ్యర్లు సుమారు కొంత వరకు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని కీలక ఏరియాల్లో 3 - 5 కోట్ల రూపాయల వరకు నష్టం తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిర్మాతలు స్వయంగా ఆదుకునే పరిస్థితి లేకపోవడంతో, ఇప్పుడు హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటిలే దిక్కు అని బయ్యర్లు భావిస్తున్నారు.
ఇతర హీరోల బాటలో బాలయ్య.. ?
గతంలో పలువురు అగ్ర హీరోలు తమ సినిమాల వల్ల నష్టపోయిన నిర్మాతలను, బయ్యర్లను ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రభాస్: 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాల సమయంలో తన నిర్మాతలకు అండగా నిలిచేందుకు కొత్త సినిమాలకు తక్కువ రెమ్యూనిరేషన్ తీసుకున్నారు. సూర్య ఇటీవలే 'కంగువ' విడుదల సమయంలో ఎదురైన ఇబ్బందులను తొలగించడానికి వ్యక్తిగత హామీలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్: 'హరిహర వీరమల్లు' షూటింగ్ ఆలస్యం కావడం వల్ల కలిగిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తన రెమ్యూనిరేషన్ కూడా వదులుకున్నారని టాక్.
బాలయ్య - బోయపాటి చొరవ చూపుతారా?
ఈ సినిమాలో బాలయ్య మరియు బోయపాటి భారీ స్థాయిలో రెమ్యూనిరేషన్లు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. వరుసగా నాలుగు హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య, ఒకవేళ తన పారితోషికంలో కొంత భాగాన్ని వెనక్కి ఇచ్చి బయ్యర్లను ఆదుకుంటే పరిశ్రమలో ఆయన గౌరవం మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలయ్య, బోయపాటి ఇద్దరూ కలిసి కొంత మొత్తం సర్దుబాటు చేస్తే బయ్యర్లకు కనీసం ఉపశమనం లభించే అవకాశం ఉంది. బాలయ్య రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టింపులకు పోరు. నిర్మాతల శ్రేయస్సే ఆయన కోరుకుంటారు. ఇప్పుడు అఖండ 2 విషయంలో తన వంతుగా ఇప్పటికే సాయం చేశారు. ఇప్పుడు బయ్యర్లను ఆదుకునేందుకు ముందుకు వస్తే నిజంగానే జై బాలయ్య గా అందరి మనసుల్లో నిలిచిపోతాడు.