జగన్‌పై పవన్‌ నిప్పులు.. ఇదేం మాఫియా?

Chakravarthi Kalyan
తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటు చేసుకున్న దయనీయ ఘటన అమానవీయమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. కడప జిల్లా చిట్వేలుకి చెందిన శ్రీ నరసింహ కుమారుడు జసవ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ రుయాలో చనిపోయాడని.. ఉచిత అంబులెన్స్ సేవలు ఆపేయడం వల్ల శ్రీ నరసింహ తన బిడ్డ మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి పడిన కష్టం, వేదన దృశ్యాలు చూశానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. ప్రైవేటు అంబులెన్సు ఆపరేటర్లు డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేక.. చనిపోయిన తొమ్మిదేళ్ళ బిడ్డను భుజంపైన వేసుకొని 90 కి.మీ. బైక్ మీద వెళ్లిన ఆ ఘటన కలచి వేసిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.


బిడ్డను కోల్పోయిన శ్రీ నరసింహ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌...  ఈ ఘటనకు విధుల్లో ఉన్న ఓ వైద్యుణ్ణి సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంటోందన్నారు. డ్యూటీలో ఉండే మెడికల్ ఆఫీసర్స్ వైద్యం చేయాలా? అంబులెన్సులు పురమాయించాలా అని ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగం పటిష్టం చేయకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు.


ఈ ఒక్క ఘటనే కాదు - రుయా ఆసుపత్రిలోనే కరోనా సమయంలో ఆక్సిజన్ లేకపోవడంతో 30 మంది మృత్యువు బారినపడ్డారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గుర్తు చేశారు. కడప రిమ్స్ లో విద్యుత్ కోతలతో పిల్లలు మృతి చెందారని... వరుసగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని.. పవన్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యపరమైన మౌలిక సదుపాయాలు కొరత గురించే నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యులు డా. సుధాకర్ గారు బలంగా మాట్లాడితే వేధించారని గుర్తు చేసిన పవన్.. ఆ వేదనతోనే ఆ డాక్టర్ చనిపోయారన్నారు.


ఈ సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తున్నాయని.. ప్రభుత్వ తీరు వల్లే మాఫియా జులుం చూపిస్తోందని.. ఎక్కడో వెనకబడ్డ రాష్ట్రాల్లో రుయాలో చోటు చేసుకున్న ఘటనలు గురించి చదివే వాళ్ళమని... ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా చోటు చేసుకుందని పవన్ వాపోయారు.  ప్రభుత్వం వైద్య రంగం మీద ఏపాటి శ్రద్ధ చూపుతుందో తెలుస్తోందన్న పవన్..  కన్నవారి కడుపు కోత అర్థం చేసుకోలేని స్థితికి ఆసుపత్రుల చుట్టూ ఉండే మాఫియాలు తయారయ్యాయన్నారు.  వాటిపైనా, వారిని పెంచి పోషిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: