ఆ ఐపీఎస్పై ఏకంగా ప్రధానికి రఘురామ కంప్లయింట్..?
ఇక ఢిల్లీ వెళ్లిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనను ఇబ్బంది పెడుతున్న ఏపీ సీఐడీ బాస్ పీవీ అనిల్ కుమార్పై ఏకంగా ప్రధాన మంత్రి మోడీకి లేఖరాశారు. రాష్ట్ర సిఐడి ఛీఫ్ పివి సునీల్ కుమార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఏకంగా ప్రధాని మోదీకి ఎంపీ ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ సునీల్ కుమార్.. ముఖ్యమంత్రి జగన్తో కుమ్మక్కై తనకు ప్రాణహానికి హాని తలపెట్టారని ప్రధానికి రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు.
మరి ఓ ఐపీఎస్పై నేరుగా ప్రధానికి లేఖ రాయాలంటే.. ఏవైనా ఆధారాలు కావాలి కదా. అందుకు కొన్ని పత్రికల్లోని క్లిప్పింగులను తన లేఖకు జత చేశారు రఘురామ కృష్ణంరాజు. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నడిచే అంబేద్కర్ ఇండియా మిషన్ సంస్థ ద్వారా ఏపీలోని అనేక పోలీసు స్టేషన్లలో ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై కేసులు నమోదు అయ్యాయట. అవన్నీ పీవీ సునీల్ కుమార్ చేయించారని రఘురామ ఆరోపిస్తున్నారు. ఈ కేసుల ఆధారంగా తనను విచారణకు పిలిపించి తనపై భౌతికంగా దాడి చేసి.. తనను హతమార్చాలనే కుట్ర ఉన్నట్టు రఘురామ కృష్ణంరాజు ప్రధాని మోడీకి లేఖ రాశారు.
ఇప్పటికే గత ఏడాది మే 14న తనను కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారని ఎంపీ రఘురామ తెలిపారు. తర్వాత కూడా గుంటూరు జైలుకు పంపి.. అక్కడే తనను హతమార్చాలని కుట్ర పన్నారని రఘురామ ఆరోపించారు. అయితే.. అదృష్టం కొద్దీ తాను ఆ కుట్ర నుంచి తప్పించుకున్నానని.. అందుకే ఇప్పుడు మళ్లీ తనను టార్గెట్ చేస్తున్నారని ఎంపీ రఘురామ చెబుతున్నారు.