టిక్కెట్ లేకుండా సినిమా చూపించిన జ‌గ‌న్‌...!

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషి అయినట్టే తెలుస్తోంది. జగన్‌ను చిరంజీవి తన సోదరుడు గా అభివర్ణించారు. ఓ వైపు టాలీవుడ్ కు ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధం జరుగుతున్న వేళ పండగ పూట జగన్ చిరంజీవిని తన ఇంటికి ఆహ్వానించడంతో మెగాస్టార్ పొంగిపోయారు. ఎంతో ఆప్యాయతతో తనను చూసుకున్నారని చిరంజీవి మురిసిపోయారు. ఓవరాల్ గా చూస్తే చిరంజీవి జగన్ చూపించిన అప్యాయ‌త‌కు చాలా అయిపోయారు అని చెప్పాలి.
అంతేకాకుండా జగన్ తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్ అందరివాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ ఇండస్ట్రీ విష‌యంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పారు. ఇక సినిమా పరిశ్రమ సంగతి కాసేపు పక్కన పెడితే జగన్ రాజకీయంగా చాలా సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. చిరంజీవి సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ల ధరల పై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పై మాటల యుద్ధానికి దిగారు.
అయితే జగన్ మాత్రం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు నేరుగా సమాధానం చెప్పకుండా ఆయన సోదరుడు చిరంజీవిని ఇంటికి పిలిపించుకుని ఆదిథ్యం ఇచ్చి చిరంజీవి తోనే సమాధానం చెప్పించారు. చిరంజీవి కూడా జగన్ ను కలిసిన అనంతరం ఇంకెవరు దీనిపై కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేయ‌వ‌ద్ద‌ని చెప్పారు. ఏదేమైనా చిరంజీవి సినిమా పరిశ్రమ కష్టాల కోసమే ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు అనటంలో ఎలాంటి సందేహం లేదు.
చిరంజీవికి రాజకీయాల గురించి ఆలోచించే సమయం - శక్తి కూడా ఆయనకు లేవు. అయితే జగన్ మాత్రం చాలా తెలివిగా చిరంజీవిని తన వద్దకు పిలిపించుకుని ఆయన నోటితో ఏం చెప్పాలనుకున్నారో చిరుతో చెప్పించేశారు. ఇండ‌స్ట్రీ వాళ్ల‌కు టిక్కెట్ లేకుండా సినిమా చూపించేశారు. అలాగే ఇండస్ట్రీలో తన వ్యతిరేకుల‌కు గ‌ట్టి ఆన్స‌ర్ ఇచ్చార‌ని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: